కారెక్కేద్దాం ...జంపింగ్ ఫిక్స్,ఆ ఎనిమిది మంది వీరేనా : చేరిక లాంఛనమే..!
తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల నాటి నుండి గులాబీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ సైతం చేపట్టకుండా జంప్ జిలానీల్లో ఆశలు పెంచుతున్న టిఆర్యస్ పార్టీ..ఇప్పుడు గురి పెట్టిన ఎనిమిది మందిని పార్టీలో చేర్చుకోవటానికి రంగం సిద్దమైంది. సంక్రాంతి పండుగ తరువాత కారెక్కేయటానికి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్దమైపోయారని సమాచారం..
సీఎల్పీ నేత లేరు..చక్కదిద్దే బాధ్యత ఎవరిది..
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు పూర్తవుతుంది. రెండో దఫా ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి గా కేసీఆర్ ప్రమాణ స్వీకారం సైతం చేసారు. క్యాబినెట్ మాత్రం విస్తరించకుండా ఆశావాహుల్లో..జంప్ జిలానీల్లో వ్యూహా త్మకంగా ఆశలు పెంచుతున్నారు. ఇదే సమయంలో..ఇప్పటి వరకూ సీఎల్పీ నేతను ఎన్నుకోలేదు. కాంగ్రెస్ లో పరి స్థితులను చక్కదిద్దే నేతలు కరువయ్యారు. ఉన్న నేతలు ఇంకా ఎన్నికల ఫలితాల పోస్టుమార్టం పేరుతో దూషణల పర్వం కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితులనే టిఆర్యస్ తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఎన్నికలు పూర్తయిన నాటి నుండే టిఆర్యస్ నేతలు కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లారని తెలిసినా.. నష్ట నివారణ చర్యల్లో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారు. ఫలితంగా ఇప్పుడు కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడి కారెక్కటానికి సిద్దమయ్యారని సమాచారం.
ఆ ఎనిమిది మంది లక్ష్యంగా..ఆపరేషన్ ఆకర్ష్..!
కాంగ్రెస్ నుండి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో టిఆర్యస్ నేతలు టచ్లో ఉన్నట్లు కొంత కాలంగా విస్తృత ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా.. వారికి భవిష్యత్ రాజకీయాల పై భరోసా..పదవులు..వారసులకు అవకాశాలు వంటి వాటిని గులాబీ నేతలు వారి ముందు ప్రతిపాదిస్తున్నారు. కొందరు నేతలు టిఆర్యస్ తో టచ్లో ఉన్నప్పటికీ జంపింగ్ వార్తలను ఖండిస్తున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి టీఆర్ఎస్లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. వారితోపాటు నిజామాబాద్ జిల్లా నుంచి గెలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె. సురేందర్ కూడా టీఆర్ఎస్లో చేరతారని అంటున్నారు. ఇక, రంగారెడ్డి జిల్లా నుండి సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక, వీరితో పాటుగా టిడిపి నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా టిఆర్యస్ నేతలు సైతం వీరి చేరిక విషయాన్ని అధికారికంగా చెప్పకపోయినా..అంతర్గత చర్చల్లో మాత్రం అంగీకరిస్తున్నారు.
కాంగ్రెస్ -టిడిపి ని జీరో చేయటమే లక్ష్యంగా..
తెలంగాణలో తాజా ఎన్నికల్లో టిడిపి నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల కోసం టిఆర్యస్ విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరు ఇప్పటికే సంసిద్దత వ్యక్తం చేయగా..మరొకరు తర్జన భర్జన పడుతున్నారు. ఇక, కాంగ్రెస్ నుండి గెలిచిన వారిలో ఆరుగురు ఇప్పటికే టిఆర్యస్ తో చేతులు కలపటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి టిఆర్యస్ లోకి జంప్ అవుతే..ఇక గ్రేటర్ పరిధిలో టిఆర్యస్..ఎంఐఎం..బిజెపి మినహా కాంగ్రెస్ - టిడిపి కి ప్రాతినిధ్యం ఉండకుండా పోతోంది. ఇదే టిఆర్యస్ లక్ష్యం గా కనిపిస్తోంది. ఇక, చేవెళ్ల ఎంపి విశ్వేశ్వర రెడ్డి టిఆర్యస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. దీనికి బదులు తీర్చుకోవటాని కి అన్నట్లుగా అదే ప్రాంతం నుండి కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న కార్తీక్ రెడ్డిని టిఆర్యస్ లోకి తీసుకొని వచ్చే లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల సీటు ఇచ్చే ప్రతిపాదన పై చర్చ సాగుతోంది. ఇక, చేరికలు పూర్తవ్వటం ద్వారా క్యాబినెట్ విస్తరణ .. పదువుల పందేరం పూర్తి చేస్తారని టిఆర్యస్ నేతలు చెబుతున్నారు.