హైద్రాబాద్ను గుర్తించండి: కేంద్రమంత్రికి కేసీఆర్ లేఖ
హైదరాబాద్: హైదరాబాద్ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేష్ శర్మకు ఆయన లేఖ రాశారు.
దేశవ్యాప్తంగా 32 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయని, వాటిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కటి కూడా లేదని, ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చటానికి ఏటా యునెస్కో ఒక్కో దేశం నుంచి ఒక్కో ప్రతిపాదనను అనుమతిస్తుందన్నారు.
వాస్తవానికి, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూంబ్స్, చార్మినార్లను కలిపి హైదరాబాద్కు చెందిన కుతుబ్ షాహీ మాన్యుమెంట్స్గా గుర్తించాలని, హైదరాబాద్ను ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చాలని కోరుతూ 2012 జనవరిలోనే భారత ప్రభుత్వం అధికారికంగా ప్రతిపాదనలు పంపిందని, ఆ తర్వాత అక్టోబర్ 2012లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ మిషన్ను పరిశీలన నిమిత్తం హైదరాబాద్కు పంపారని తెలిపారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాజస్థాన్ కోటలను 2013లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చిందని, హైదరాబాద్ వ్యవహారాన్ని పక్కన పెట్టిందని, వచ్చే ఏడాది (2015)లో జరగనున్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సమావేశాల కోసమైనా హైదరాబాద్ను భారత ప్రభుత్వం అధికారికంగా ప్రతిపాదించాలని కేసీఆర్ ఆ లేఖలో కోరారు.
హైదరాబాదుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. ఇంపీరియల్ సిటీగా ఢిల్లీని ప్రతిపాదించడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని తెలిసిందని, అందుకే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రతిపాదనను విరమించుకుందని కథనాలు వచ్చాయని, దాంతో, 2015 వరల్డ్ హెరిటేజ్ సమావేశాల్లో ప్రతిపాదనలను భారత్ కోల్పోయే అవకాశం ఉందని, అందువల్ల హైదరాబాద్ను ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నగరానికి చారిత్రక నేపథ్యమేకాక, అంతర్జాతీయ గుర్తింపు ఉందన్నారు. ఇటీవల అంతర్జాతీయ ట్రావెల్ జర్నల్ నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ ప్రపంచంలో తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాల్లో హైదారాబాద్కు రెండో ర్యాంకు ఇచ్చిందని చెప్పారు.