ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ కోసం మిలిటెంట్ ఉద్యమాలు చెయ్యండి : మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ లేఖ
ప్రైవేటీకరణ లో భాగంగానే ఆర్టీసీ విలీనం చేయడం లేదని సిపిఐఎంఎల్ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖను విడుదల చేసింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను సాధించుకునే వరకు మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టండి అని పిలుపునిచ్చింది. కార్మికుల సమ్మెకు ప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటించాలని మావోయిస్టు పార్టీ కోరింది.
ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగమే సీఎం నిర్ణయం అన్న మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టిఆర్ఎస్ ప్రభుత్వం పై పౌరుల ప్రాథమిక హక్కులను, వాక్ స్వాతంత్రాన్ని కాల రాస్తోందని , ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని నిర్లక్ష్యం చేస్తోందని లేఖలో పేర్కొంది. ప్రైవేటీకరణ చెయ్యాలన్న కుట్రతోనే ఆర్టీసీ విలీనం చెయ్యటం లేదని పేర్కొంది. ప్రభుత్వమే ఆర్టీసీ యాజమాన్యాన్ని చెప్పుచేతల్లో పెట్టుకొని, అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకొని పెత్తనం చెలాయిస్తున్నదని మండిపడింది మావోయిస్టు పార్టీ.
నియంత ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిక
మావోయిస్ట్ తెలంగాణా రాష్ట్ర కమిటీ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కార్మికులపై కొనసాగిస్తున్న విధానాలను తక్షణమే మానుకోవాలని లేఖలో ప్రకటించింది మావోయిస్టు పార్టీ. అంతేకాదు నియంత ప్రభుత్వాలు ప్రజల ఆవేశానికి గురికాక తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వీరోచితంగా పోరాటం సాగించాలని, అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొంది.
అన్ని సెక్షన్ల ప్రజలు ఆర్టీసీ కార్మికలకు అండగా ఉండాలని పిలుపు
మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదల చేసిన లేఖలో న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు అన్ని సెక్షన్ల ప్రజలు తమ సంపూర్ణ మద్దతు అందించాలని కోరింది. సీఎం కెసిఆర్ నియంత విధానాలను, సమ్మె చేస్తే ఉద్యోగాలు తొలగిస్తామని తీసుకున్న నిర్ణయాలను నిరంకుశ పోకడలను లేఖ ముఖంగా ప్రశ్నించింది మావోయిస్టు పార్టీ . ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పట్టించుకోకుండా ఆర్టీసీ బస్సులు నడపడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికింది.
సమస్యల పరిష్కారం కోసం త్యాగాలకు సిద్ధం కండి .. మిలిటెంట్ ఉద్యమాలు చెయ్యండని లేఖ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్ టి సి లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని, డీజిల్ వ్యాట్ ను, మోటారు వాహన పన్నును మినహాయించాలని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా అణచివేసే ధోరణితో వ్యవహరించడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని లేఖలో పేర్కొంది మావోయిస్టు పార్టీ. ఇక ఈ నేపథ్యంలోనే సమస్యలకు పరిష్కారం దొరికేవరకు మిలిటెంట్ ఉద్యమాలు సాగించాలని పిలుపునిచ్చింది. లేఖ ద్వారా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మావోయిస్టు పార్టీ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తెలంగాణ సర్కార్ కు హెచ్చరికలు జారీ చేసింది.