ప్రాణాలతో చెలగాటం ... పైసల కోసం కుక్కలు, పందుల కళేబరాలతో నూనె తయారీ
కాసుల కక్కుర్తి మనిషిని నీచంగా మారుస్తుంది. పక్కనోడు ఏమైపోతే మాకేం .. మేం బతికితే చాలు అన్నట్టు జనాలను తయారు చేస్తుంది. డబ్బు కోసం ఎంత దారుణానికైనా ఒడిగడుతున్న నీచులు కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక విషయం అందర్నీ భయానికి గురి చేస్తుంది. కల్తీలతో ప్రాణాలు గాలిలో దీపంగా మారాయి అన్న భావన కలుగుతుంది.
జంతు కళేబరాలతో నూనె తయారీ
జంతువుల కళేబరాల కొవ్వుని కరిగించి దాని నుంచి వచ్చే నూనెతో వ్యాపారం చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. కుక్కలు, పందులు వంటి జంతువుల కళేబరాలతో నూనె తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాను రంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు . రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ పంచాయతీ, రైల్వే స్టేషన్ సమీపంలోని హరి ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో కొందరు వ్యాపారులు కుక్కల, చనిపోయిన పందులు వాటి కళేబరాలతో కల్తీ నూనె తయారు చేస్తున్నారు.
కల్తీ నూనె దందాకు పోలీసులు షాక్ .. 8మంది అరెస్ట్
ఇక దీనిని మళ్ళీ కాస్త పల్లీ నూనెలో కలిపి ఎవరికీ అనుమానం రాకుండా విక్రయిస్తున్నారు. ఇక కల్తీ నూనెపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు , పోలీసులు పరిశ్రమను తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న దందా చూసి షాక్ తిన్నారు. ఇక ఈ కల్తీ నూనె దందాకు పాల్పడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. సదరు నూనె తయారీ పరిశ్రమను సీజ్ చేశారు.
కల్తీ నూనె వ్యాపారం గుట్టు రట్టు చేసిన స్థానికులు
ఇక అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నారు. ఇక ఈ పరిశ్రమలో జంతు కళేబరాలతో కల్తీ నూనె, ముక్కలతో దాణా తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా కాలంగా గమనిస్తున్న స్థానికులు దుర్వాసన వస్తున్న క్రమంలో పరిశ్రమలోకి వెళ్లి ఈ కల్తీ నూనె వ్యాపారాన్ని బయట పెట్టారు. స్థానికులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ తరహా వ్యాపారాలు, కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న గ్యాంగ్ లు మన చుట్టూనే ఉన్నారు. ఇక ఎక్కడ ఏం తినాలన్నా, తాగాలన్నా భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు .