మంత్రి మల్లారెడ్డి ఆస్తుల కేసు: కుటుంబసభ్యుల విచారణ, ఏమన్నారంటే?
హైదరాబాద్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కుటుంబసభ్యులను ఆదాయపుపన్ను శాఖ(ఐటీ) అధికారులు ప్రశ్నించారు. నవంబర్ 22, 23 తేదీల్లో మల్లారెడ్డికి సంబంధించిన వ్యాపారాలు, విద్యా సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 16 మందికి నోటీసులు జారీ చేశారు.
బషీర్బాగ్లోని ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు. దీంతో మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. వీరితోపాటు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలకు చెందిన డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్, అకౌంటెంట్లు, మొత్తం 13 మంది విచారణకు హాజరయ్యారు.
మంత్రి మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డిని కూడా ఐటీ అధికారులు విచారించారు. మూడు రోజుల క్రితం రెండు రోజులపాటు మల్లారెడ్డి విద్యా సంస్థలు, ఇళ్లలో సోదాలు నిర్వహించిన సమయంలో ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. వాటిని విశ్లేషించిన ఐటీ అధికారులు.. అందులోని సమాచారం ఆధారంగా వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. మొత్తం ఆరు గంటలపాటు విచారించిన ఐటీ అధికారులు పలు వివరాలు సేకరించినట్లు సమాచారం.
ఐటీ అధికారులు విచారించిన అనంతరం మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారుల అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాల విచారణ చేశారని, వారి ప్రశ్నలకు జవాబిచ్చామన్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని అధికారులు చెప్పారని తెలిపారు.