మల్లన్న సాగర్ వివాదానికి ఎండ్ కార్డ్ : హరీశ్ రావు చర్చలు సఫలం
మెదక్ : భూసేకరణ కారణంగా గత కొద్ది రోజులుగా వివాదం రేగుతోన్న మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయినట్టుగా సమాచారం. మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో నిర్వాసితులతో జరుపుతోన్న చర్చలు సఫలం కావడంతో, ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు అక్కడి రైతులు ఒప్పుకున్నారు.
తాజా చర్చల్లో భాగంగా.. ముంపు గ్రామాల బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు వల్ల కోల్పోయే భూములకు ఎకరా రూ.6 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని నిర్వాసితులకు హరీశ్ రావు హామి ఇచ్చారు.
నిర్వాసితులను అన్ని విధాలుగా అండగా నిలబడుతామని చెప్పిన హరీశ్, ప్రాజెక్టు వల్ల ఎక్కువగా నష్టపోతున్న ఏటిగడ్డ, క్రిష్టాపూర్ గ్రామస్తులకు మరో చోట కొత్త గ్రామాన్ని కట్టి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని నిర్వాసితులకు భరోసా కల్పించారు.
కొత్త గ్రామం నిర్మించిన తర్వాత ప్రభుత్వమే దాని అభివృద్ధి బాధ్యతలు తీసుకుంటుందని చెప్పిన ఆయన, గ్రామాన్ని ప్రభుత్వమే దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. కాగా, మంత్రి హరీశ్ రావు పూర్తి భరోసా వ్యక్త పరచడంతో.. సంతృప్తి చెందిన రైతులు భూసేకరణకు అంగీకరించారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామన్న రైతులందరికీ మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు.