మల్లారెడ్డి కాలేజీకి న్యాక్ షాక్... బోగస్ పత్రాలు... ఐదేళ్ల పాటు బ్లాక్ లిస్టులో...
హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి న్యాక్ (నేషనల్ అసెస్మెంట్&అక్రిడేషన్ కౌన్సిల్) షాకిచ్చింది. తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారన్న కారణంతో మల్లారెడ్డి కాలేజీని ఐదేళ్ల పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది. న్యాక్ నిర్ణయంతో మల్లారెడ్డి కాలేజీ ఐదేళ్ల పాటు అక్రిడేషన్ కోల్పోయే అకాశం ఉంది. ఈ మేరకు కాలేజీ యాజమాన్యానికి న్యాక్ నోటీసులు పంపించింది.
Recommended Video
కొంపల్లి సమీపంలోని దూలపల్లిలో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి అక్రిడేషన్ పునరుద్దరణ కోసం ఇటీవల కాలేజీ యాజమాన్యం న్యాక్కి దరఖాస్తు చేసుకుంది. అయితే ఇందులో బోగస్ పత్రాలు ఉన్నట్లు గుర్తించడంతో మల్లారెడ్డి కాలేజీని అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో వచ్చే ఐదేళ్ల పాటు మల్లారెడ్డి కాలేజీ అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండా నిషేధం విధించినట్లయింది.
బీహెచ్ఈఎల్, యష్ టెక్నాలజీస్, ఎయిర్టెల్కు సంబంధించిన బోగస్ డాక్యుమెంట్లతో మల్లారెడ్డి కాలేజీ న్యాక్ గ్రేడ్ పొందే ప్రయత్నం చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై డిజిటల్ నిపుణులను కూడా సంప్రదించగా... ఆ కంపెనీల పేరుతో ఉన్న సర్టిఫికెట్లు,సంతకాలు,లెటర్ హెడ్స్ అన్నీ బోగస్గా గుర్తించినట్లు పేర్కొన్నారు.
కాగా, ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ కాలేజీలకు న్యాక్ గుర్తింపు చాలా ముఖ్యమైనది. క్యాంపస్ ప్లేస్మెంట్లో న్యాక్ గ్రేడ్ కీలకం. మల్లారెడ్డి కాలేజీని బ్లాక్ లిస్టులో పెట్టడంతో అందులో చదువుతున్న విద్యార్థుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. మల్లారెడ్డి విద్యా సంస్థలు మంత్రి మల్లారెడ్డికి చెందినవి కావడంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మంత్రి మల్లారెడ్డి ఇంకా స్పందించలేదు.
ఇటీవల మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదైన సంగతి తెలిసిందే. తమ భూమిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారని సూరారంకు చెందిన శ్యామలా దేవి అనే మహిళ మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి తన భూమిని కబ్జా చేసుకున్నారని ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.