కెసిఆర్ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన మల్లు భట్టి విక్రమార్క
వరంగల్: రైతుల రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఏకిపారేశారు. టీఆర్ఎస్ది అసమర్థ, అవినీతి, అవగాహన లేని ప్రభుత్వమని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం చేస్తున్న దశలవారీ రుణమాఫీ రైతుల్లో, బ్యాంకు అధికారుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోందని తప్పు పట్టారు. శుక్రవారం వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో కాంగ్రెస్ నేతలు రైతు భరోసా యాత్ర సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ప్రసంగించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విధానాల వల్ల బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వటం లేదన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయమంటే అలవిగాని కోరికలంటూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. ఈ ముఖ్యమంత్రిని తరిమికొట్టాల్సిన రోజు వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతుల కోసమే రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చామని, ఈ బంద్కు ప్రజలు మద్దతివ్వాలని కోరారు.
బీహార్లో ఓటమి భయంతోనే బీజేపీ మతాలను తెరపైకి తెస్తోందని, రిజర్వేషన్లు లేకుండా చేయడమే ఆరెస్సెస్ ముఖ్య ఉద్దేశమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీసీలకు అన్యాయం జరిగితే సహించేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్ ప్రభుత్వం పూర్తి రుణమాఫీ చేయకపోవడం వల్లే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు పూర్తిగా రుణమాఫీ చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. రేపటి తెలంగాణ బంద్కు అందరూ సహకరించాలని కోరారు.