కలిసి తుమ్మలకు చుక్కలు చూపిస్తారా: కాంగ్రెసుకు జగన్ మద్దతు, బాబు ఏం చేస్తారో...
హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలను అన్నింటినీ ఏకం చేసి ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు చుక్కలు చూపించాలని తెలంగాణ కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు ప్రారంభించారు.
తమ ప్రయత్నాల్లో భాగంగా కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క శుక్రవారం సాయంత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. పాలేరులో ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిగా తమ అభ్యర్థిగా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
రేపో మాపో ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కూడా కలిసే అవకాశం ఉంది. తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే ఆయన టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణతో సమావేశమయ్యారు. అయితే, చంద్రబాబును సంప్రదించి తమ నిర్ణయం చెబుతామని రమణ చెప్పారు.
దాంతో ఆయన నేరుగా చంద్రబాబుతో మాట్లాడాలని భావిస్తున్నారు. శుక్రవారం గానీ శనివారం గానీ ఆయన విజయవాడ వెళ్లి చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో మల్లుభట్టి విక్రమార్క జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
దాంతో నేరుగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో చర్చలు జరపి, తమ్మినేని వీరభద్రాన్ని ఒప్పించాలని అనుకుంటోంది. ఈ మేరకు ఎఐసిసి ప్రతినిధులు సీతారాం ఏచూరితో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా పాలేరులో సిపిఐ, సిపిఎం, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు బలం ఉండడంతో అన్ని పార్టీలు కలిస్తే టిఆర్ఎస్ను ఓడించవచ్చుననే భావనతో కాంగ్రెసు ఉంది.
కాంగ్రెసు శాసనసభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో పాలేరు శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. టిఆర్ఎస్ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది. మంత్రి తుమ్మల నాగేశ్వర రావును బరిలోకి దించుతోంది. తెలుగుదేశం పార్టీ నామా నాగేశ్వర రావును దించాలనే ప్రయత్నంలో ఉంది.
అహంకారంతో పాలేరులో టిఆర్ఎస్ పోటీ చేస్తోందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పాలేరులో కాంగ్రెసు అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైయస్ జగన్ అంగీకరించినట్లు ఆయన చెప్పారు. పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని వైసిపి నిర్ణయించింది. కాంగ్రెసు ప్రతిపాదించే ఉమ్మడి అభ్యర్థికి మద్దతిస్తామని జగన్ చెప్పారు.
జగన్తో భేటీ తర్వాత మల్లుభట్టి విక్రమార్క వైసిపి తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి ఆ విషయం చెప్పారు. తొలుత పాలేరులో పోటీ చేయాలని వైసిపి భావించింది. అయితే, మల్లుభట్టి విక్రమార్క జగన్తో సమావేశమైన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది.
గత సంప్రదాయాల మేరకు పాలేరులో కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఓ శాసనసభ్యుడు ఆకస్మికంగా మరణిస్తే ఆ నియోజకవర్గంలో ఆ శాసనసభ్యుడి కుటుంబ సభ్యులు నిలబెడితే పోటీ చేయవద్దనే నిర్ణయం గతంలో తీసుకున్నట్లు, దానికి కట్టుబడి తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు.