ఆ భయంతో మమత హైప్రొఫైల్ డ్రామా, కోల్కతా ప్రజలారా! రోడ్లపైకి రండి: రాజాసింగ్
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ధర్నా చేయడం లేదని, హై ప్రొఫైల్ డ్రామా చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ నిప్పులు చెరిగారు. కుంభకాణాల్లో తన పేరు ఎక్కడ బయట పడుతుందోనని ఆమె భయపడుతున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి
శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో తన పేరు వస్తుందని మమతా బెనర్జీ భయంతో ఉన్నారని రాజాసింగ్ లోథ్ అన్నారు. అందుకే ఆమె అక్కడ డ్రామాలు చేస్తున్నారన్నారు. అందుకే నేను పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేస్తున్నానని, అవినీతి ముఖ్యమంత్రికి మద్దతుగా నిలబడతారా ఆలోచించాలని కోరుతున్నానని అన్నారు. మమతా బెనర్జీ లేని బెంగాల్ ఇప్పుడు అవసరమని చెప్పారు.
కోల్కతా ప్రజలారా.. రోడ్ల పైకి రండి
మమతా బెనర్జీ వ్యవహరించిన తీరుపై దేశంలోనే కాదని, ప్రపంచంలోనే చర్చ జరుగుతోందని రాజాసింగ్ అన్నారు. ఓ అవినీతి పోలీసు అధికారిని కాపాడటం కోసం ఆమె హై ప్రొఫైల్ డ్రామా నడిపిస్తోందన్నారు. శారదా చిట్ ఫండ్స్, రోజ్ వ్యాలీ స్కాంలు ఉన్నాయని, ఇందులో తన పేరు బయటకు వస్తుందని ముఖ్యమంత్రి మమత భయపడుతున్నారని, అందుకే పోలీస్ అధికారిని కాపాడుతున్నారని, ఇదో డ్రామా అన్నారు. మమతా బెనర్జీని, సదరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారిని బహిష్కరించాలన్నారు. మమతకు వ్యతిరేకంగా కోల్కతా ప్రజలు రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు.
మమత, మంత్రులు రోడ్లపైకి
అంతకుముందు రోజు చేసిన ట్వీట్లోను మమతపై రాజాసింగ్ లోథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారిని కాపాడటం కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మంత్రులు అందరూ రోడ్డు పైకి రావడం విడ్డూరమన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆమె సీబీఐ అధికారులను అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. సుప్రీం ఆదేశాలను గుడ్డిగా తొక్కిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ అత్యున్నత న్యాయస్థానం గుడ్డిది కాదని చెప్పారు.