'ఒంటరి మహిళను.. నాతో గడపాలనుకుంటే..' : పోలీసులు చెక్ పెట్టారు
హైదరాబాద్ : ఓ వివాహిత బ్రతుకును బజారుకీడ్చాలని చూసిన వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. సదరు మహిళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అసభ్యకరంగా కరపత్రాలు ముద్రించిన అతగాడు.. వాటిని మహిళ నివాసముండే ప్రాంతంలో పంచి పెట్టాడు. దీంతో విషయం ఆ నోటా.. ఈ నోటా.. బాధిత మహిళకు తెలియడంతో.. కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయించింది.
కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన ఓ మహిళ తన భర్త ఉండగానే.. మరో వ్యక్తితో కొన్నాళ్ల నుంచి సన్నిహితంగా మెలుగుతోంది. ఇటీవల ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో.. తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిని దూరం పెట్టేసింది. ఇన్నాళ్లు సన్నిహితంగా మెలిగి ఇప్పుడు దూరం పెడుతోందన్న అక్కసుతో.. మహిళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ఆమె సన్నిహితుడు భావించాడు.
ఇందుకోసం జీడిమెట్లలోని ఓ ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడితో కలిసి మహిళపై అసభ్యకర కరపత్రాలు ముద్రించాడు.' నేనో ఒంటరి మహిళను,నాతో గడపాలనుకునేవారు నన్ను సంప్రదించవచ్చు' అని ఫోన్ నంబర్ తో సహా కరపత్రాలు ముద్రించాడు. దాదాపు 500 కరపత్రాలను మహిళ నివాసముండే కాలనీ వారికి, చుట్టు పక్కలవారికి పంచి పెట్టాడు. విషయం తెలిసిన బాధిత మహిళ తీవ్ర మనస్థాపానికి గురై పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాల్సిందిగా కోరింది.
దీంతో నిందితుల గురించి ఆరా తీసిన పోలీసులు.. వారిని త్వరగానే అదుపులోకి తీసుకోగలిగారు. అనంతరం నిందితుడితో పాటు ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడిపై సెక్షన్-354, 509, 501 కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.