అశ్లీల వీడియోల పిచ్చి! అలాగే చేయమని భార్యపై దాడి, అపస్మారకస్థితిలోకి
హైదరాబాద్: పెళ్లైన నాటి నుంచి భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ముగ్గురు పిల్లలైనా ఆమెపై తరచూ కొట్టి గాయపరుస్తూ ఉన్నాడు. తాజాగా, మరోసారి ఆమెపై దాడి చేయడంతో తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చేరింది. బాధితురాలు, ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేశారు పోలీసులు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగర శివారు దుండిగల్లో నివసిస్తున్న ఉమర్ పాషాకు.. ఎంఎస్ మక్తా నివాసి షబానా బేగం కుమార్తె రేష్మా సుల్తానాకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. ఆడపిల్లలు పుట్టారని కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడు ఉమర్.
రోజూ హింసే
అంతేగాక, రేష్మాపై అయిష్టత వ్యక్తం చేసిన అతడు ఓ కుమార్తెను బంధువుకు దత్తత ఇచ్చాడు. రేష్మా తల్లిదండ్రులను ఇంటికి రానివ్వకుండా ఆంక్షలు విధించాడు. భార్యను రోజూ హింసించేవాడు. గతంలో రెండుసార్లు తీవ్రంగా కొడితే పెద్దల సమక్షంలో సర్దిచెప్పారు.
అశ్లీల వీడియోల పిచ్చితోనే...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఆమెపై దారుణంగా దాడి చేయడం గమనార్హం. ఉమర్పాషా ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూడటంతోపాటు తనకు నచ్చినట్టు నడుచుకోవాలని భార్యను వేధించేవాడు. ఆమె అంగీకరించకపోవడంతో తరచూ దాడిచేసేవాడు. ఇటీవల కూడా భార్యకు అశ్లీల వీడియోలు చూపించి వేధించాడు. విసిగిపోయిన ఆమె వైఫై స్విచ్చాఫ్ చేసింది. కోపోద్రికుడైన పాషా భార్య తల, ఛాతి, ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. ఆమె అత్తమామలు కూడా కొడుకుకే వత్తాసు పలకడంతో మరింత రెచ్చిపోయి రేష్మాపై దాడిచేశాడు. అతడి దెబ్బలకు తాళలకే అపస్మారకస్థితికి చేరుకోవడంతో.. అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో ఆమెను తీసుకెళ్లి మక్తాలోని ఆమె తల్లి ఇంటివద్ద పడేసి.. తలుపుకొట్టి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
రేష్మా వాంగ్మూలంతో..
కాగా, కుమార్తెను చూసిన తల్లి.. స్థానికుల సహాయంతో ఆస్పత్రిలో చేర్చి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందు ఘటన ఇక్కడే జరిగిందని భావించి కేసు నమోదు చేసిన పోలీసులు.. రేష్మా కోలుకున్న తర్వాత వాంగ్మూలం తీసుకొని కేసును దుండిగల్ పోలీసులకు అప్పగించారు.
పిల్లలకూ భద్రతపై తల్లి ఆందోళన
ఆస్పత్రిలో కోలుకుంటున్న రేష్మాబేగంను పాతబస్తీకి చెందిన కొంతమంది స్థానిక నేతలు పరామర్శించగా... భర్త అరాచకాలను వారి వద్ద ఏకరువు పెట్టింది. తన ముగ్గురు కుమార్తెలకు కూడా భద్రత లేదని.. వారిని రక్షించాలని వేడుకుంది. మైనర్లయిన తన పిల్లలను తల్లికి అప్పగించాలని కోరింది. అమ్జదుల్లాఖాన్తోపాటు పలువురు నేతలు రేష్మ తల్లి షబానా బేగంతో కలిసి దుండిగల్లో ఆమె అత్తింటికి వెళ్లారు. ఉమర్పాషా తండ్రి హాజీ, కుటుంబీకులకు విషయాన్ని వివరించి పిల్లలను అప్పగించాలని కోరారు. ముందు వారు వ్యతిరేకించినప్పటికీ... పోలీసుల జోక్యంతో పిల్లలను అప్పగించడానికి అంగీకరించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య, స్థానిక వార్డు మెంబర్ ముహమ్మద్ మసూద్ సమక్షంలో పిల్లలను షబానా బేగానికి అప్పగించారు.
నిందితుడిపై హత్యాయత్నం కేసు
భార్యపై దాడి చేసిన ఉమర్పాషాపై ముందు సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు... బాధితురాలి వాంగ్మూలం తర్వాత సెక్షన్లను మార్చారు. తనపై ఉద్దేశ పూర్వకంగానే దాడి చేశాడని, చెప్పినట్టు నడుచుకోకపోతే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. హత్యాయత్నం కింద సెక్షన్ 307 కేసు అతడిపై పెట్టామని దుండిగల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.