కేటీఆర్ పర్సనల్ సెక్రటరీని అంటూ మోసాలు... ఆస్పత్రి యజమానికే టోకరా వేసే ప్రయత్నం...
తెలంగాణ ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్సనల్ సెక్రటరీని అంటూ పలువురి నుంచి డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15న నగరంలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రికి ఫోన్ చేసిన అతను... తాను మంత్రి కేటీఆర్ పీఎస్ తిరుపతిరెడ్డిని అని చెప్పాడు. ఆస్పత్రి ఛైర్మన్ నంబర్ ఇవ్వాలని అడిగి తీసుకున్నాడు. ఆపై ఆ నంబర్కు ఫోన్ చేసి... త్వరలో మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పాడు. ఎల్బీ స్టేడియంలో ఆయన ప్రమాణస్వీకారం ఉంటుందని... ఇందుకోసం మీడియాలో ప్రకటనల నిమిత్తం డబ్బులు ఇవ్వాలని కోరాడు.
అతనిపై అనుమానంతో ఆస్పత్రి యాజమాన్యం ఎంక్వైరీ చేసింది. దీంతో అతను కేటీఆర్ పీఎస్ కాదని తేలింది. వెంటనే ఆస్పత్రి యాజమాన్యం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలోనూ ఇలాగే కేటీఆర్ పేరు చెప్పి పలువురి నుంచి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించిన నాగరాజు అనే యువకుడే ఈ మోసానికి తెరలేపి ఉంటాడని అనుమానిస్తున్నారు. నాగరాజుపై సైబర్ క్రైమ్తో పాటు, బాలానగర్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లలో ఇప్పటికే కేసులు ఉన్నాయి.
కేటీఆర్ పీఏని అంటూ అతను గతంలో ఓ కంపెనీ సీఎండీని బోల్తా కొట్టించాడు. ఆ సీఎండీగా ఫోన్ చేసి తనను తాను కేటీఆర్ పీఏగా పరిచయం చేసుకున్నాడు. బ్రిటన్లో జరగనున్న టీమ్ ఇండియా అండర్-25 క్రికెట్ వరల్డ్ కప్కు నాగరాజు అనే నిరుపేద ఆటగాడు సెలెక్ట్ అయ్యాడంటూ తెలిపాడు. అతనికి క్రికెట్ కిట్ కోసం రూ.3 లక్షల 40 వేలు స్పాన్సర్ చేస్తే... ఆ కిట్లపై మీ కంపెనీ లోగో ఉంటుందని, పబ్లిసిటీ వస్తుందని నమ్మబలికాడు. ట్రూ కాలర్లో ఫోన్ నంబర్ కేటీఆర్ పీఏ అని రావడం వల్ల సదరు కంపెనీ సీఎండీ అతడు ఇచ్చిన అకౌంట్లో డబ్బును జమచేశాడు. కానీ మోసపోయానని గ్రహించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో అప్పట్లో నాగరాజు అరెస్టయ్యాడు.
గతంలో లాలాపేట్కి చెందిన కార్తికేయ,ఫెడ్రిక్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఇలాగే కేటీఆర్ పీఏలమంటూ మోసాలకు తెరలేపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సిబ్బందిని బెదిరించి పనులు చేయించుకున్నారు. రూ.2లక్షలకు సంబంధించి ఓ ఆస్పత్రికి నకిలీ డాక్యుమెంట్స్ సమర్పించిన కేసులో కార్తికేయను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. కార్తికేయ ఇచ్చిన వివరాలతో ఫెడ్రిక్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.