200 మందిని మోసం: ప్లాస్మా పేరుతో వంచన, యాంటీ వైరల్ డ్రగ్ అని దోచి, అరెస్ట్
కూటి కోసం కోటి విద్యలు అని పెద్దలు అన్నారు. కానీ కాలం మారింది. సిచుయేషన్ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు కొందరు కేడీ గాళ్లు. కూటి కోసం తమ చావు తెలివితేటలను వాడుకొంటున్నారు. అవును ఇందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సందీప్ రెడ్డి అనే యువకుడు ముందు వరసలో ఉంటాడు. చిన్న వయస్సులోనే దొంగతనాలు చేసి జైలుకెళ్లి వచ్చిన సందీప్.. ఈ సారి ఏకంగా పెద్ద మొత్తంలో నగదు దోచేయాలని ప్రణాళిక రచించాడు. అందుకు తాను కరోనా వైరస్ జయించిన వాడిలా బిల్టప్ ఇచ్చాడు. వాస్తవానికి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం.. ప్లాస్మా డోనర్ రక్తం అంటే మంచి డిమాండ్ ఉంది.. దీనిని అతను క్యాష్ చేసుకున్నాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు 200 మందిని ఇదేవిధంగా మోసం చేశాడు.
జైలు నుంచి..
ఓ దొంగతనం కేసుల ఇటీవలే విశాఖ జైలు నుంచి సందీప్ విడుదలయ్యాడు. బయటకి వచ్చి చూస్తే కరోనా కరళా నృత్యం చేస్తోంది. వైరస్ సోకిన రోగులకు ప్లాస్మా అనేది వరం.. దీనిని ఆసరాగా చేసుకొన్నాడు. తనకు కరోనా వైరస్ వచ్చి నయమయ్యిందని పలువురిని నమ్మించాడు. ప్లాస్మా డోనెట్ చేస్తానని చిలకపలుకలు పలికాడు. నిజమేనని నమ్మిన చాలా మంది అతని వలలో పడ్డారు. అంతేకాదు యాంటి వైరల్ డ్రగ్ విక్రయిస్తానని కూడా కలరింగ్ ఇచ్చాడు.
మాటలు నమ్మి..
ఇతని మాటలను రోగులు నిజంగానే నమ్మారనుకో.. ఇక అంతే సంగతులు.తనకు ప్రయాణ ఖర్చుల కోసం నగదు కావాలని అడుగుతాడు. అందుకోసం నగదును ఖాతాలో వేశారో అంతే.. పత్తాలేకుండా పోతాడు. ఇలా ఇప్పటివరకు 200 మందిని మోసం చేశాడని పోలీసులు తెలిపారు. టోసిలిజుమాబ్ 400 ఎంజీ ఇంజెక్షన్ కూడా ఇస్తానని చెప్పి మోసం చేశాడు.
Recommended Video
పలు కేసులు
ఇతనిపై పంజాగుట్ట, బంజారాహిల్స్, రాంగోపాల్ పేట్ పోలీసు స్టేషన్లో వివిధ కేసులు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది అమాయకులను సందీప్ మోసం చేశాడని అడిషనల్ డీసీపీ చక్రవర్తి తెలిపారు. చివరికి చిక్కడంతో అదుపులోకి తీసుకున్నామని వివరించారు.