సొంత అన్నే కాటేశాడు.. కొత్తగూడెంలో చెల్లెలిపై అత్యాచారం..
మహిళా భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రతీరోజూ ఎక్కడో చోట మహిళలు లైంగిక దాడికి గురవుతూనే ఉన్నారు. ఆఖరికి రక్త సంబంధీకులు కూడా మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. తాజాగా కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సొంత అన్నే చెల్లెలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. జరిగిన ఘటనను తీవ్ర అవమానంగా భావించిన చెల్లెలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
పాల్వంచ పట్టణంలో..
పాల్వంచలోని జ్యోతినగర్లో పిప్పిడి వెంకటి-రాధమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రాంబాబు,భూమిక అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాంబాబుకు వివాహం కావడంతో పాల్వంచలోనే వేరే కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇటీవలే భూమికకు కూడా నిశ్చితార్థం జరిగింది. గురువారం బంధువుల పెళ్లికి బయలుదేరిన వెంకటి,రాధమ్మ.. భూమికను తన అన్నయ్య రాంబాబు ఇంటి వద్ద దిగబెట్టారు.
చెల్లెలిపై అత్యాచారం..
గురువారం రాత్రి రాంబాబు చెల్లెలు భూమికను తీసుకుని జ్యోతినగర్లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. మనసులో దుర్బుద్ది పుట్టిన రాంబాబు.. భూమికపై బలత్కారం చేశాడు. జరిగిన ఘటనకు షాక్కి గురైన భూమిక అవమానంతో పురుగుల మందు తాగింది. కాసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. అలాగే నడుచుకుంటూ ఇంటి సమీపంలోని రోడ్డు పైకి వచ్చింది.
చికిత్స పొందుతూ మృతి..
భూమికను గుర్తించిన స్థానికులు పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి కొత్తగూడెంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆమె కన్నుమూసింది. భూమికపై ఆమె సోదరుడితో పాటు,అతని స్నేహితుడు కూడా అత్యాచారానికి పాల్పడి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిందితుల అరెస్ట్..
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే ఖమ్మం జిల్లాలో కన్నబిడ్డపై తండ్రి అత్యాచార ఘటన మరవకముందే.. మరో ఘటన వెలుగుచూడటం జిల్లాలో కలకలం రేపుతోంది.