మాజీ భార్యను మట్టుబెట్టాలనుకున్నాడు..మహిళ చాకచక్యంతో అడ్డంగా దొరికాడు
ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై ఉన్మాదుల దాడులు ఎక్కువైపోతున్నాయి. కొందరు తమను ప్రేమించనందుకు యువతులను హత్య చేస్తుంటే, మరికొందరు సొంత భార్యలనే అనుమానం పేరుతో చంపేస్తున్నారు. పట్టపగలే కాపు కాసి మరీ మహిళలపై కత్తులతో వేటువేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఓ వ్యక్తి తన మాజీ భార్యను చంపేందుకు స్కెచ్ గీశాడు. అయితే పోలీసుల కంట పడటంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది.
లావణ్య అనే మహిళనే ఆమె మాజీ భర్త సాయికిరణ్ హత్యచేయాలని భావించాడు. ఇందుకోసం ఓ వేటకొడవలిని తనతో పాటు తెచ్చుకున్నాడు. సాయికిరణ్ను చూసిన లావణ్య అతని దగ్గర నుంచి ప్రమాదం ఉందని భావించి అక్కడ నుంచి పరుగులు తీసి పోలీస్ స్టేషన్కు చేరుకుంది.పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సాయికిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా తన షర్టు వెనకాల ఓ కత్తి పోలీసులకు దొరికింది.
బోరబండలో నివాసం ఉంటున్న లావణ్యకు సాయికిరణ్తో గతంలోనే వివాహం జరిగింది. వారికిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. లావణ్య ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కుటుంబంలో తలెత్తిన కలహాలతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. లావణ్య ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. ఇక ఇది ఓర్వలేకపోయిన సాయికిరణ్ ఆమెను ఎలాగైనా సరే చంపేసేయాలనే నిర్ణయానికి వచ్చేశాడు.
శనివారం ఉదయం లావణ్య ఉంటున్న కాలనీలో సంచరిస్తుండగా ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే డయల్ 100 నెంబరుకు ఫోను చేసి సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో కూడా సాయికిరణ్ వాగ్వాదానికి దిగాడు. లావణ్యను చెప్పరాని మాటలతో దూషించాడు. అయితే సాయికిరణ్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.