కేసీఆర్, చంద్రబాబు చంపెయ్యమన్నారంటూ.. బట్టలిప్పిచ్చి, కలకలం రేపుతున్న సెల్ఫీ సూసైడ్ నోట్
ఓ ఎస్సై ఓ యువకుడిని గొడ్డును బాదినట్లు బాదడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు తన ఆవేదనను ఓ సెల్ఫీ వీడియోలో చిత్రీకరించి ఆపైన ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: ఓ ఎస్సై ఓ యువకుడిని గొడ్డును బాదినట్లు బాదడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు తన ఆవేదనను ఓ సెల్ఫీ వీడియోలో చిత్రీకరించి ఆపైన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి సెల్ఫీ వీడియో సూసైడ్ నోట్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఐదేళ్ల క్రితం జిల్లాలోని వెల్దండ మండలం, చెరుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నారాయణపూర్ తాండాకు చెందిన పట్లావత్ రాజు(26)కు రంగారెడ్డి జిల్లాకు చెందిన అంజలితో వివాహమైంది.
వివాహానంతరం కొన్నేళ్లు వీరి సంసారం సజావుగానే సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలం క్రితం ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో అంజలి తన పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్యతో చర్చల నేపథ్యంలో అత్తగారింటికి వెళ్లిన రాజుపై భార్య తరపు బంధువులు దాడి చేయడమేకాక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో తాళకొండపల్లి పోలీసు ఎస్సై సైదాబాబు, అతడి సిబ్బంది రాజును కౌన్సెలింగ్ పేరుతో స్టేషన్ కు పిలిపించి చితక్కొట్టారు.
తాను చేసిన తప్పేంటి అని నిలదీయగా.. 'కేసీఆర్, చంద్రబాబు నిన్ను చంపేయమన్నారు.. అందుకే కొడుతున్నా..' అంటూ ఎస్సై సైదాబాబు చెప్పాడని రాజు తన సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
తన బట్టలు ఇప్పించి గొడ్డును బాదినట్లు బాదారంటూ అతడు కన్నీటిపర్యంతమయ్యాడు. పోలీసులు కొట్టిన దెబ్బలకు నడవలేకపోతున్నానని, ఇదెక్కడి న్యాయం.. పోలీసులు ఇలాగేనా ప్రవర్తించేది? అంటూ ప్రశ్నించాడు.
అంతేకాదు, తప్పంతా మగవాళ్లదే ఉండదని, మహిళల తప్పు కూడా ఉంటుందని, కానీ వాళ్ల తప్పు కప్పిపుచ్చుకుంటూ పూర్తిగా మగవాళ్లమీదికే తోసేయడం సరికాదని రాజు వ్యాఖ్యానించాడు.
అరికాళ్లపైన, వృషణాలపైన, వీపుపైన ఎక్కడబడితే అక్కడ పోలీసులు తనను కొట్టారని, ఆడవాళ్లను వేధించే వాళ్లని సీఎం కేసీఆర్ చంపేయమన్నాడని కూడా ఎస్సై సైదాబాబు వ్యాఖ్యానించాడని, తనను ఎక్కడికైనా తీసుకెళ్లి చంపేసి వచ్చి చెప్పండంటూ భార్య తరపు బంధువులతో ఎస్సై చెప్పాడని రాజు వాపోయాడు.
ఈ ఘటన అంతరం మనస్థాపంతో రాజు పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, అది గమనించిన కుటుంబ సభ్యులు అతడ్ని హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రిలోనే రాజు మరణించాడు.
రాజు అంత్యక్రియల సమయంలో అతడి మొబైల్ ఫోన్ లో ఈ సెల్ఫీ వీడియో సూసైడ్ నోట్ లభ్యమైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారడంతో దీన్ని వీక్షించిన వారంతా రాజును చితకబాది అతడి మృతికి కారణమైన ఎస్సై సైదాబాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.