బడిలో ప్రసవంపై ఎంఈవో సస్పెన్షన్, టీచర్లకు షోకాజ్: సోదరి సెక్స్ వర్కర్! అతనిపై డౌట్
హైదరాబాద్: మాధాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల బాలిక బాత్రూంలో ప్రసవం జరిగిన అంశంపై తెలంగాణ విద్యా శాఖ సీరియస్గా ఉంది. వెంటనే చర్యలు తీసుకోవాలని డిఈవోకు ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకు సంబంధించి శేరిలింగంపల్లి ఎంఈవోను సస్పెండ్ చేశారు. పాఠశాలలోని పదిమంది ఉపాధ్యాయులకు తాఖీదులు జారీ చేశారు. తొమ్మిదో తరగతి విద్యార్థిని బాత్ రూంలో ప్రసవించడంపై ఉపాధ్యాయులను నిలదీసింది. విద్యార్థుల విషయంలో ఇలాగేనా ఉండేది? ఐనా డెలివరీ టైం వచ్చే వరకు ఏం చేశారు? అని ప్రశ్నించారు.
నిందితుడిపై కేసు
మరోవైపు, బాలిక పైన అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. 22 ఏళ్ల యువకుడి పైన స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అతని పేరు ధను అని తెలుస్తోంది. అతను ఓ క్యాంటీన్లో పని చేస్తుంటాడు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
బాధిత అమ్మాయికి, ఆమె కుటుంబ సభ్యులకు కూడా నిందితుడి పూర్తి పేరు తెలియదని పోలీసులు చెప్పారు. బాలిక కుటుంబ సభ్యులు చంద్రానాయక్ తండాలో ఉంటున్నారు. ప్రస్తుతం విద్యార్థిని, పుట్టిన బిడ్డ క్షేమంగా ఉన్నారు.
ఆమె శనివారం ప్రసవించిందని, అప్పటి వరకు ఉపాధ్యాయులకు ఎవరికీ ఈ విషయం తెలియదని చెబుతున్నారని పోలీసులకు చెప్పారు. ప్రసవం జరిగిన విషయాన్ని ఓ విద్యార్థి గుర్తించి, ఉపాధ్యాయులకు చెప్పగా.... వారు విద్యార్థినిని, పుట్టిన బిడ్డను వారి ఇంటికి తీసుకు వెళ్లారు.
విద్యార్థిని తండ్రి, అక్కడి నుంచి సోదరి ఇంటికి పంపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం తండ్రిని సంప్రదించారు. దీంతో, ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రసవమైన విద్యార్థిని తల్లి చనిపోయింది. తండ్రి కూలీ పని చేస్తుంటాడు. విద్యార్థిని సోదరికి గర్భం దాల్చిన విషయం తెలిసు. అయినప్పటికీ పాఠశాలకు వెళ్లవద్దని చెప్పలేదు.
అత్యాచారం పది నెలల క్రితం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బాధిత బాలిక తన సోదరితో కలిసి ఉంటున్న సమయంలో ఇది జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అందుకు కారణం కూడా ఉందని తెలుస్తోంది.
ప్రసవం జరిగిన తొమ్మిదో తరగతి విద్యార్థిని సోదరి ఓ సెక్స్ వర్కర్ అని తెలుస్తోంది. ధను ఆమెకు కస్టమర్. సోదరి కోసం ధను ఇంటికి వచ్చేవాడు. ఈ కారణంగా ధనుయే సోదరితో పాటు బాధితురాలి పైన అత్యాచారం చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.