హత్యా? ప్రమాదమా?: కారులో వ్యక్తి సజీవదహనం
మహబూబ్నగర్: జిల్లా నవాబ్పేట మండలం జంగమయ్యపల్లి సమీపంలో కారులో ఓ వ్యక్తి సజీవదహనమైన ఘటన మిస్టరీగా మారింది. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కారులో ఒకరు సజీవదహనం అయినట్లు పోలీసులు గుర్తించారు.
కాగా, ఆ కారు నెంబర్ టీఎస్-08 ఈయూ-1120. ఆ కారును హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ మద్యం వ్యాపారికి సంబంధించిందిగా గుర్తించారు. కారు దగ్ధంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మృతదేహం ఆనవాలు పట్టలేని విధంగా కాలిపోవడం.. పైగా మంటలు ఎగిసిపడినప్పుడు కనీసం తప్పించుకునేందుకు ప్రయత్నం కూడా చేయనట్లు గుర్తులు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని కారులో పెట్టి తగులబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ కారును హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ మద్యం వ్యాపారికి సంబంధించిందిగా గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.