భార్య సమాధి వద్దే భర్త ఆత్మహత్య: ఆరేళ్ల కూతురికి అప్పగింతలు
హైదరాబాద్: అధికారులు దయ చూపలేదు, రాజకీయ నాయకులు పట్టించుకోలేదు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో భార్య సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు ఆ భర్త. దీంతో పిల్లలు అనాథలయ్యారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మెదక్ జిల్లా లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మచ్చ స్వామికి వర్గల్ మండలం పాతూర్ మధిర ప్రాంతం ఇప్పలగూడెంకు చెందిన సుజాతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ ఏడాది జనవరి 26న సుజాత మగబిడ్డకు జన్మనిచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంతో సుజాత గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో మరణించింది.
వైద్యుల నిర్లక్ష్యం పట్ల అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు కుటుంబ సభ్యులు. దీంతో వైద్యులు బాధితురాలికి రూ. లక్ష పరిహారంగా ప్రకటించారు. తక్షణ సహాయంగా రూ. 20వేలు ఇచ్చారు. మిగతా మొత్తం త్వరలో అందిస్తామని హమీ ఇచ్చారు. ఆ తర్వాత వారిని పట్టించుకోలేదు.
ఈ విషయమై గత మే 24వ తేదీన స్వామి తెలంగాణ సీఎం కేసీఆర్ను కలుసుకొన్నారు. తన ఆర్ధిక పరిస్ధితిని వెళ్లబోసుకొన్నాడు. సీఎం ఆదేశంతో ప్రత్యేకాధికారి హనుమంతరావు, స్వామి కుటుంబాన్ని కలిశారు. సాయం దక్కుతుందని స్వామి ఆశించాడు. కానీ సంధ్య, ఆమె చెల్లెలికి కొత్త బట్టలు ఇచ్చి.. గజ్వేల్ పట్టణంలోని కస్తుర్బా గాంధీ పాఠశాలలో చేర్పించారు.
ఆర్ధిక సాయం అందలేదు. దీంతో కూతురికి ఫోన్లో సంధ్యకు అప్పగింతలు చేశాడు. దీంతో విరక్తి చెందిన స్వామి మంగళవారం తన భార్య సమాధి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యేకాధికారి, స్వామి కుటుంబ సభ్యులను కలుసుకొని మంగళవారం కలుసుకొని రూ. 30 వేలు అందించారు.
త్వరలో మరో మూడు లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే సాయం ముందుగా ఇచ్చి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని గ్రామస్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.