భార్యను దారుణంగా హత్య చేసి దుబాయ్కి పరారీ: తిరిగి రప్పించి అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: భార్యను హత్య చేసి దుబాయ్ పారిపోయిన భర్తను డబీర్పురా పోలీసులు.. నగరానికి రప్పించి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడ్ని రిమాండ్కు తరలించారు. డీసీపీ సత్యనారాయణ మీడియా సమావేశంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
మే 20వ తేదీన దబీర్పుర బ్రిడ్జి సమీపంలో ఏడుగుళ్ల వద్ద అర్ధరాత్రి ఓ పార్సిల్ కనిపించింది. పోలీసులు దాన్ని విప్పి చూడగా మహిళ మృతదేహం ఉంది. విచారణ చేపట్టి మృతురాలు నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో తప్పిపోయిన జేబానాజ్గా గుర్తించారు.
మృతురాలి తల్లి సకీనా బేగంను విచారించగా... రెండు రోజుల క్రితం అల్లుడు అక్బర్ అలీఖాన్ అలియాస్ హైదర్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని, అదేరోజు సాయంత్రం ఫోన్ చేయగా ఫోన్ స్విచాఫ్ రావడంతో నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
ఈ క్రమంలో మృతురాలి అత్త మహబూబున్నిసా బేగం, మరుదులు మక్సూద్, ఇమ్రాన్ అలీఖాన్, ఖైసర్ అలీఖాన్ను అరెస్టు చేశారు. వారిని విచారించగా హత్యకు సహకరించినట్టు అంగీకరించారు.
మృతురాలి భర్త, ప్రధాన నిందితుడైన అక్బర్ అలీఖాన్ అలియాస్ హైదర్.. దుబాయ్ పారిపోవడంతో ఇన్స్పెక్టర్ వెంకన్న నాయక్ రీజనల్ పాస్ట్పోర్ట్ అధికారులతో కలిసి దుబాయ్లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించారు. అక్కడి అధికారులు అతడిని తిరిగి నగరానికి పంపించారు. అక్బర్.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే అతడ్ని అరెస్టు చేశామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు.