చికెన్ ముక్కకు నిండు ప్రాణం బలి: గొంతులో ఇరుక్కుపోవడంతో కుప్పకూలాడు..
చికెన్ తో చపాతీ తింటున్న సమయంలో ఒక చికెన్ ముక్క అతని గొంతుకు అడ్డం పడి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.
హైదరాబాద్: చికెన్ ముక్కకు ఓ నిండు ప్రాణం బలైపోయింది. హైదరాబాద్ లోని చిక్కడపల్లి పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆ కుటుంబానికి విషాదానికి మిగిల్చింది. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. నిర్మల, కుమారస్వామి (48) దంపతులు చిక్కడపల్లి లోని అశోక్నగర్ లో నివసిస్తున్నారు. కుమారస్వామి స్థానికంగా ఓ అపార్ట్ మెంటు వాచ్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే క్రమంలో ఈ నెల 16వ తేదీ రాత్రి కుమారస్వామి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చాక చికెన్ తో చపాతీ తింటున్న సమయంలో ఒక చికెన్ ముక్క అతని గొంతుకు అడ్డం పడింది.
వెంటనే నీళ్లు తాగిన కుమారస్వామి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం హుటాహుటిన ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్కను బయటకు తీశారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం కుమారస్వామి మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.