మరో 'నరబలి' కలకలం: తప్పించుకున్న యువకుడు.. నిందితుల పట్టివేత!
కాల్వశ్రీరాంపూర్: ఇటీవల హైదరాబాద్ లోని ఉప్పల్లో రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఓ చిన్నారిని నరబలి ఇచ్చిన సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా పెద్దపల్లి జిల్లాలోనూ కొంతమంది వ్యక్తులు నరబలికి యత్నించగా.. బాధితుడు వారి బారి నుంచి బయటపడి ప్రాణాలు రక్షించుకున్నాడు.
మొట్లపల్లి గ్రామ శివారులో:
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. కిష్టంపేట గ్రామానికి చెందిన గాదర్ల రమేష్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన సాగర్ల రవి అనే యువకుడు పొలానికి నీళ్లు పెట్టడానికి అని తనతో పాటు తీసుకెళ్లాడు.
గుప్త నిధుల కోసం..:
మొట్లపల్లి శివారులోని మానేరు ఒడ్డున ఉన్న సుంకరి కోటల వద్దకు రమేష్ను రవి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ కొంతమంది మద్యం సేవిస్తూ ఉన్నారు.
పక్కనే గుప్తనిధుల కోసం తవ్విన గుంత, నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, ఇతర మారణాయుధాలు ఉన్నాయి. దీంతో తనను నరబలి ఇచ్చేందుకే తీసుకొచ్చారని రమేష్ అనుమానించాడు.
తప్పించుకున్నాడు..:
మద్యం తాగాల్సిందిగా అక్కడున్నవారు ఒత్తిడి చేయడంతో రమేష్ అనుమానం బలపడింది. మద్యం తాగించి తనను బలి ఇవ్వాలని చూస్తున్నట్టు అర్థమవడంతో వారి నుంచి తప్పించుకుని సమీపంలోని మొట్లపల్లి గ్రామానికి చేరుకున్నాడు.
తొలుత అతన్ని దొంగగా భావించిన గ్రామస్తులు ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
దేహశుద్ది.. పోలీసులకు అప్పగింత:
రమేష్ ఇచ్చిన సమాచారంతో ఆదివారం ఉదయం రమేష్తోపాటు గ్రామస్థులు సుంకరి కోటల వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడి గుడిసెలో గుప్త నిధుల తవ్వకానికి సిద్దమవుతున్న ఒక ముఠా కనిపించింది. గ్రామస్తులను చూసి కొంతమంది పారిపోగా.. సాగర్ల రవితో పాటు మరో ముగ్గురు మాత్రం చిక్కారు. అనంతరం వారికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.