అమ్మాయితో ఉన్నట్లు తెలుస్తుందని: హోటల్పై నుంచి పడి బెంగళూరువాసి మృతి
హైదరాబాద్: వీధి బాలలు, అనాథ బాలల కోసం పని చేస్తున్నవేస్ట్ మేనేజ్మెంట్ సొసైటీకి చెందిన ఓ ఉద్యోగి హోటల్ భవనం నుంచి అనుమానాస్పద స్థితిలో కిందపడి మృతి చెందాడు. ముంబై, బెంగళూరు కేంద్రాలుగా వేస్ట్ మేనేజ్మెంట్ సొసైటీ అనాథ వీధిబాలలపై పరిశోధన చేస్తోంది.
ఓ బృందం ఈ నెల ఒకటవ తారీఖున లకిడీకాపూల్లోని ఓ హోటల్లో ఉంటున్నారు. వారు వచ్చిన పని ఇటీవలే ముగిసింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల వరకు విందు చేసుకున్నారు.
హోట్లలో దిగిన నాటి నుంచి 417 గదిలో మరో ఇద్దరితో కలిసి ఉంటున్నాడు.. బెంగళూరుకు చెందిన బృందం సభ్యుడు ఆంగ్లో రోడ్రిస్. శనివారం తెల్లవారుజామున బృందం సభ్యురాలు ఆయేషాను తీసుకొని మూడో అంతస్తులోని 308 గదికి వెళ్లాడు.
బృందం ఇంఛార్జికి బెంగళూరు రావాల్సిందిగా ఆ సమయంలో ఫోన్ వచ్చింది. తనకు బదులు ఆంగ్లో రోడ్రిస్ (34)ను పంపించాలనుకొని.. సదరు ఇంఛార్జ్ శనివారం ఉదయం రోడ్రిస్ బస చేస్తున్న 417 గదికి వెళ్లాడు. అక్కడ అతను కనిపించలేదు.
అతను ఆయేషాతో కలిసి మరో గదికి వెళ్లిన విషయం తెలుసుకొని అక్కడకు వెళ్లి తలుపు తట్టాడు. అయితే, తాను అమ్మాయితో ఉన్న విషయం తెలుస్తుందని భావించిన రోడ్రిస్ గది కిటికీ నుంచి బయటకు వెళ్లాడు. అతను అక్కడి నుండి కిందపడ్డాడు.
మరోవైపు ఆ అమ్మాయి తలుపు తీసి రోడ్రిస్ లేడని చెప్పింది. అయితే, అప్పటికే అతను కిందపడి తల పగిలి మృతి చెందాడు. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.