జిమ్ చేస్తే జీవం పోయింది..!
హైదరాబాద్ : అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. అంటే చేసే పని ఏదైనా హద్దు దాటితే అనర్థానికి దారి తీస్తుంది. ఇలాగే ఫిట్నెస్ పెంచుకునేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నం వికటించింది. సరైన శిక్షణ లేకుండా జిమ్లో వ్యాయామం చేయడంతో ప్రాణాలు వదిలాడు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో జరిగిన ఉదంతం సంచలనం సృష్టించింది.
హాజీపూర్ బావిలో మొన్న శ్రావణి, నేడు మనిషా.. శవాల మీద శవాలు..! హత్యలు చేశానని అంగీకరించిన సైకో?
జిమ్ చేస్తుండగా అస్వస్థత
పంజాబ్కు చెందిన ఆదిత్య 9 నెలల క్రితం హైదరాబాద్ వచ్చాడు. సిటీలోని ఓ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు లేక పోవడంతో బీకేగూడ బస్తీలో ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం ఎస్సార్ నగర్లోని ఓ జిమ్లో జాయిన్ అయిన ఆదిత్య సోమవారం ఉదయం ఎప్పటిలాగే ఎక్సర్సైజులు చేశాడు. గంట పాటు జిమ్ చేసిన అనంతరం కడుపు, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని నిర్వాహకులతో చెప్పాడు. రెస్ట్ తీసుకోమని చెప్పిన వారు విషయాన్ని అతని స్నేహితుడు హుస్సేన్ ఖాన్కు చెప్పారు. దీంతో ఆదిత్యను తొలుత ఇంటికి తీసుకెళ్లిన హుస్సేన్ పరిస్థితి సీరియస్గా మారడంతో దగ్గరలోని నీలిమా హాస్పిటల్కు తీసుకెళ్లాడు
హాస్పిటల్కు వెళ్లేలోపే మృత్యువాత
హాస్పిటల్లో ఆదిత్యను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని చెప్పారు. కడుపు, ఛాతీలో నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్ వాడినందునే కార్డియాక్ అరెస్ట్ అయి ఉండొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఎక్సర్సైజ్ చేసిన అనంతరం నొప్పి నివారణ మందులు వాడటం ప్రమాదకరమని అంటున్నారు. జిమ్కు వెళ్లాలనుకునే వారు తొలుత ఈసీజీ, 2డీ ఎకో, థ్రెడ్ మిల్ టెస్ట్ తదితర పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
ఆదిత్య స్నేహితుడు హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా జిమ్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. జిమ్ నిర్వాహకుల తీరుపై ఆరా తీస్తున్నారు.