'ఆమె' నగ్న ఫోటోలు పంపి అతన్నీ ఇరికించాడు..: ఎట్టకేలకు అరెస్ట్!
హైదరాబాద్: ఓ మహిళ నగ్న ఫోటోలతో మరో యువకుడికి టోకరా వేశాడో ప్రబుద్దుడు. అందినకాడికి దోచుకుని, అదీ చాలక మళ్లీ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు అతని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ బెంజిసర్కిల్కు చెందిన నందిమల్ల గోపి ఉపాధి కోసం నగరానికి వలస వచ్చాడు. సూరారం కాలనీలో నివసిస్తూ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ చేస్తున్నాడు. ఇతరుల పేర్లు, చిరునామాలతో సిమ్ కార్డులు తీసుకుని పలువురితో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఓ మహిళతో పరిచయం పెరగా.. ఎలాగోలా ఆమె నగ్న ఫోటోలు సంపాదించాడు.
ఆపై శ్రీనివాసరాజు అనే మరో వ్యక్తికి చాటింగ్ ద్వారా దగ్గరయ్యాడు. తాను అమ్మాయిని అని నమ్మించి యువతి నగ్న ఫోటోలను అతనికి పంపించాడు. ఆపై అతన్ని కూడా పంపమని కోరడంతో.. అతనూ నగ్న ఫోటోలు పంపించాడు. అప్పటినుంచి ఆ ఫోటోలు అడ్డుపెట్టుకుని అతన్ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అలా అతని నుంచి రూ.4.5లక్షలు కాజేశాడు.
అక్కడితో ఆగక మళ్లీ మళ్లీ బెదిరింపులకు దిగాడు. అడిగినంత డబ్బు ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టాడు. రూ.20లక్షలు ఇవ్వాలంటూ తరుచూ వేధిస్తుండటంతో బాధితుడు శ్రీనివాసరాజు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 1.60లక్షల నగదు, బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.