'ఫేక్' కంపెనీతో బ్యాంకులను ముంచేశాడు?: హైదరాబాద్లో ఘరానా మోసగాడు..
హైదరాబాద్: క్రెడిట్ కార్డులతో ఘరానా మోసానికి పాల్పడ్డ ఓ నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. సులువుగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్న కుంభం రంగారెడ్డి అనే వ్యక్తి.. మరికొంతమందితో కలిసి దీనికి తెరలేపాడు. బ్యాంకుల నుంచి దాదాపు రూ.1.52కోట్లు స్వాహా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ ప్లాన్..:
నల్గొండ జిల్లాకు చెందిన రంగారెడ్డి కర్మన్ఘాట్లో ఓ రిపేరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం హెచ్డీఎఫ్సి బ్యాంకు నుంచి తనకు, తన భార్యకు క్రెడిట్ కార్డులు పొందాడు.
అదే సమయంలో రంగారెడ్డి మనసులో ఓ ఆలోచన మెదిలింది. నకిలీ కంపెనీ,నకిలీ ఐడీలు సృష్టించి బ్యాంకుల నుంచి భారీ సంఖ్యలో క్రెడిట్ కార్డులు పొందాలనుకున్నాడు. తద్వారా బ్యాంకు సొమ్మును స్వాహా చేయవచ్చనేది రంగారెడ్డి ప్లాన్.
ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీ:
ఆలోచన రావడమే ఆలస్యం నల్గొండ జిల్లాకు చెందిన తన బావమరిది తిప్పర్తి వినయ్ కుమార్రెడ్డిని రప్పించి పక్కా ప్లాన్ సిద్దం చేశాడు. ముందుగా తన కుమార్తె పేరుతో పర్ణిక నానో సొల్యూషన్ అనే ఒక ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీ సృష్టించాడు.
మేకా సంతోష్ రెడ్డి అనే వ్యక్తి సహకారంతో 41మంది ఇతరుల ఫోటోలను సంపాదించి పర్ణిక నానో సంస్థ ఉద్యోగులుగా వారి పేరు మీద ఐడీ కార్డులు సిద్దం చేశాడు.
కార్డులూ సంపాదించాడు..:
ఐడీలు కూడా సిద్దమయ్యాక.. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న వరికుప్పల శ్రీకాంత్, మక్కల నరేష్ల సహకారంతో ఆయా వ్యక్తుల పేర్ల మీద ఓటర్ గుర్తింపు కార్డులు కూడా సిద్దం చేయించాడు.
ఆపై పాన్ కార్డులు కూడా అలాగే చేయించాడు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక సంతోష్నగర్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో తన కంపెనీ పేరుతో బ్యాంకు ఖాతా, 41 మంది ఉద్యోగుల పేర్లతో ఖాతాలను తెరిచాడు.
41మంది పేర్లతో క్రెడిట్ కార్డులు..:
ఉద్యోగులకు నెలానెలా జీతాలు ఇస్తున్నట్టు నమ్మించడానికి ప్రతీ నెల ఆ 41ఖాతాల్లో డబ్బులు వేసేవాడు. ఆ తర్వాత రెండు రోజులకే నగదు విత్ డ్రా చేసేవాడు. ఇలా బ్యాంకు అధికారులకు కాస్త నమ్మకం కలిగాక.. క్రెడిట్ కార్డుల కోసం వారిని సంప్రదించాడు. హెచ్డీఎఫ్సీ ,భారతీయ స్టేట్బ్యాంక్, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకుల నుంచి 41మంది ఉద్యోగుల పేర్ల మీద క్రెడిట్ కార్డులు సంపాదించాడు.
రూ.1.52కోట్లు దండుకున్నాడు..:
ఒక్కో క్రెడిట్ కార్డు కోసం బ్యాంకు అధికారులు రెడ్డిపల్లి సందీప్ కుమార్, ఉప్పు ఆనంద్లు రూ.1000 నుంచి రూ.2వేలు తీసుకున్నారు. క్రెడిట్ కార్డులు చేతిలోకి రాగానే.. పలు దఫాలుగా ఆ కార్డుల నుంచి మొత్తం రూ.1.52కోట్లు దండుకున్నాడు రంగారెడ్డి.
ఇటీవలే ఈ వ్యవహారం వెలుగుచూడటంతో ఎక్కడికో పరారయ్యాడు. ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అతన్ని పట్టుకోగలిగారు. రంగారెడ్డితో పాటు మరో 10మందిని కూడా అరెస్ట్ చేశారు.