ప్రభుత్వంలో పదవులు ఇప్పిస్తానని... సీఎం కేసీఆర్ కార్యదర్శి పేరుతో మోసాలు...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదర్శినని చెప్పుకుంటూ మాయ మాటలతో వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం పేషిలో కార్యదర్శిగా తనకున్న పలుకుబడితో ప్రభుత్వంలో పదవులు వచ్చేలా సీఎంకు సిఫారసు చేస్తానని పలువురు నేతల నుంచి అతను వసూళ్లకు పాల్పడ్డాడు. పక్కా సమాచారంతో సోమవారం(జూన్ 21) నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ జిల్లాకు చెందిన కమల్ కృష్ణ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. ఏళ్లు గడిచినా సంపాదన పెద్దగా లేకపోవడంతో ఈజీ మనీ కోసం పాకులాడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో సీఎం పేషిలో కార్యదర్శినని చెప్పుకుంటూ మోసాలకు తెరలేపాడు.
సీఎంతో చెప్పి పదవులు ఇప్పించేంత చనువు తనకు ఉందని పలువురిని నమ్మించాడు. బీసీ కార్పోరేషన్లో పదవి ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అలా వివిధ పార్టీలకు చెందిన నేతలకు వివిధ పదవులు ఆశచూపి డబ్బులు వసూలు చేశాడన్న ఆరోపణలున్నాయి. కమల్ కృష్ణపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు అందడంతో అతనిపై గట్టి నిఘా పెట్టారు. ఎట్టకేలకు సోమవారం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Recommended Video
గతంలోనూ సీఎంవో పేరు చెప్పుకుని పలువురు మోసాలకు తెరదీశారు.హైదరాబాద్లోని కాప్రాకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి తాను సీఎం ఓస్డీని అని చెప్పి పలువురిని మోసం చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాలు,స్థలాలు ఇప్పిస్తానని అమాయకుల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. సీఎంతో చెప్పి సికింద్రాబాద్లో ఎకరం స్థలం ఇప్పిస్తానని ఓ జ్యోతిష్కుడి నుంచి రూ.25 లక్షలు కాజేశాడు. ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని మరో వ్యక్తి నుంచి రూ.25లక్షలు వసూలు చేశాడు. సుధాకర్ మోసాలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అతనిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.