కామాంధుడి అరెస్ట్.. వావి వరుసలు సైతం మరిచి... కూతురి వరుసయ్యే బాలికకు వేధింపులు
హైదరాబాద్లో ఓ కామాంధుడి వేధింపుల ఘటన వెలుగుచూసింది. వావి వరుసలు సైతం మరిచి కూతురు వరసయ్యే బాలికను వేధిస్తున్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్లుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే... నేరెడ్మెట్ సప్తగిరి కాలనీకి చెందిన జయరాం ప్రసాద్(40) నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నాడు. ప్రసాద్ భార్య 2013లో చనిపోయింది. ప్రస్తుతం తన 14 ఏళ్ల కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఇదే క్రమంలో మరో పెళ్లి చేసుకోవాలని భావించిన ప్రసాద్... 2015లో నేరెడ్మెడ్కే చెందిన ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.
ఆమె భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని ఆమె అంగీకారం మేరకు పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు 17 ఏళ్ల కూతురు ఉండటంతో... పెళ్లి తర్వాత తమతో పాటు తీసుకొచ్చుకున్నారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే కొన్నాళ్లుగా బాలికపై కన్నేసిన జయరాం ప్రసాద్ లైంగికంగా ఆమెను వేధిస్తున్నాడు. విషయం తల్లికి చెప్పడంతో కూతురిని బంధువుల ఇంటికి పంపించింది. దీంతో అప్పటినుంచి భార్యను కూడా వేధించడం మొదలుపెట్టాడు. కూతురిని తిరిగి ఇంటికి తీసుకురావాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు.
ప్రసాద్ వేధింపులు తాళలేక అతని భార్య నేరెడ్మెట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తన కూతురిని భర్త లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో సోమవారం(అక్టోబర్ 5) అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.