డ్రగ్ మాఫియా ఘాతుకమే: ఎంపీ నుంచి వచ్చి వ్యాపారి కిడ్నాప్, హతమార్చి ఉప్పుపాతరేశారు
హైదరాబాద్: కూకట్పల్లికి చెందిన వ్యాపారి చంద్రశేఖర్ హత్య మిస్టరీ వీడింది. చంద్రశేఖర్ కాల్ లిస్టు ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు హత్య కేసును ఛేదించారు. అతడ్ని హతమార్చింది డ్రగ్ మాఫియానే అని పోలీసులు తేల్చారు. అతని ఆనవాలు కూడా దొరక్కుండా.. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన 11మంది నిందితులు ఘట్కేసర్ ప్రాంతంలో ఆ వ్యాపారి శవాన్ని ఉప్పుపాతర వేయడం గమనార్హం.
అక్రమంగా డ్రగ్స్ సరఫరా.. అదృశ్యం
హైదరాబాద్లోని కేపీహెచ్బీ మూడో ఫేజ్లో ఉండే నేరెళ్ల చంద్రశేఖర్(40) కూకట్పల్లి ప్రశాంత్నగర్లో గాజు గ్లాసుల తయారీ కర్మాగారం నిర్వహిస్తుండేవాడు. పేరుకు ఆ పనే అయినా అక్రమంగా మాదకద్రవ్యాలను తయారు చేసి, సరఫరా చేస్తుండేవాడు. కాగా, సెప్టెంబర్ 16న అనూహ్యంగా అతడు అదృశ్యమయ్యాడు. రెండురోజుల అనంతరం అతడి భార్య శోభ కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ఆరంభమైంది.
కాల్ లిస్టే కీలకం.. ఆరోజే హత్య..
చంద్రశేఖర్ కాల్లిస్ట్ను పరిశీలించగా.. చివరి కాల్ ఘట్కేసర్ అన్నోజిగూడకు చెందిన మచ్చగిరి మాట్లాడినట్లు తేలింది. పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టగానే అతడు అదృశ్యమయ్యాడు. మూడురోజుల క్రితం మచ్చగిరి అన్నోజిగూడకు వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా విస్తుపోయే రీతిలో హత్యోదంతం వెలుగుచూసింది. అదృశ్యమైన రోజే చంద్రశేఖర్ను ఇండోర్(మధ్యప్రదేశ్) డ్రగ్ మాఫియా అంతమొందించినట్లు వెల్లడైంది.
మధ్యప్రదేశ్ గ్యాంగ్కు ముడి డ్రగ్స్..
ఇండోర్కు చెందిన బ్రిజ్భూషణ్ పాండే, సంతోష్సింగ్లు కూడా ఏడాదిన్నర క్రితం వరకు చర్లపల్లి పారిశ్రామికవాడలో గ్లాస్ కర్మాగారం మాటున అక్రమంగా డ్రగ్ దందా నిర్వహించేవారు. గత సంవత్సరం వీరి కర్మాగారం పక్కనే పోలీసులు దాడులు నిర్వహించడంతో దందాను నిలిపివేసి ఇండోర్ వెళ్లిపోయారు. అక్కడే ఎపిడ్రిన్ అనే మాదకద్రవ్యాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ ద్వారా ముడిపదార్థాలు తెప్పించుకొని ఎపిడ్రిన్ తయారు చేసేవారు.
కుట్ర పన్నిన సహ వ్యాపారి..
కాగా, అక్కడ స్థానికంగా దందా నిర్వహించే సోహైల్ అనే వ్యక్తికి ఇది కంటగింపుగా మారింది. దీంతో పాండే, సంతోష్సింగ్లను దెబ్బతీయాలని పథకం వేశాడు. వారికి హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ ముడిపదార్థాల్ని సరఫరా చేస్తున్నాడని తెలుసుకున్నాడు. అనంతరం చంద్రశేఖర్ నుంచి వివరాలు సేకరించి మధ్యప్రదేశ్లోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)కు సమాచారం అందించాడు. డీఆర్ఐ దాడులు నిర్వహించడంతో పాండే, సంతోష్సింగ్లకు సుమారు రూ. 4 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. అంతేకాకుండా మధ్యప్రదేశ్, గుజరాత్ల్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఇండోర్లో జైల్లోంచి గత ఆగస్టు 17న గుజరాత్ పోలీసులు వారిని వారెంట్పై తీసుకెళ్తుండగా మార్గమధ్యలో తప్పించుకున్నారు.
లీక్ చేశాడనే దారుణం
హైదరాబాద్ నుంచి అందిన సమాచారం వెళ్లిన కారణంగానే తాము డీఆర్ఐకి చిక్కామని భావించిన బ్రిజ్భూషణ్ గ్యాంగ్ చంద్రశేఖర్పై పగ పెంచుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్కు వచ్చి మచ్చగిరిని కలిసింది. అప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్న అతడికి డబ్బు ఎర వేసి ఆరా తీయగా.. తమ ప్రత్యర్థి సోహైల్కు చంద్రశేఖరే సమాచారం అందించాడని తేలింది. దీంతో ఇండోర్ నుంచి సెప్టెంబర్ 16న రెండు వాహనాల్లో 11 మంది అన్నోజిగూడకు వచ్చారు. మచ్చగిరితో చంద్రశేఖర్కు ఫోన్ చేయించి ప్రశాంత్నగర్కు వచ్చి అతడిని అపహరించుకుపోయారు. ఆ తర్వాత కొంపల్లి శివారులో కర్రలతో దారుణంగా కొట్టడంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఉప్పుపాతరేశారు..
అనంతరం , చంద్రశేఖర్ మృతదేహాన్ని వాహనంలో వేసుకుని ఔటర్ రింగ్రోడ్డుకు తీసుకెళ్లారు. కొర్రేముల వద్ద గొయ్యి తీసి అందులో పాతిపెట్టారు. మచ్చగిరి సలహా మేరకు మృతదేహం ఆనవాళ్లు చిక్కకుండా ఉండటం కోసం గోతిలో ఉప్పు వేసి పాతేశారు. అనంతరం మచ్చగిరి కూడా బ్రిజ్భూషణ్ బృందంతోపాటే మధ్యప్రదేశ్ పారిపోయాడు. అయితే చంద్రశేఖర్ హత్య కేసులో సాక్ష్యం లేకుండా చేసేందుకు బ్రిజ్భూషణ్ బృందం తననూ చంపవచ్చనే అనుమానం కలిగింది మచ్చగిరికి. దీంతో మూడురోజుల క్రితం మధ్యప్రదేశ్ నుంచి తప్పించుకుని నగరానికి వచ్చిన అతడు పోలీసులకు చిక్కాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా సోమవారం పోలీసులు కొర్రేములలో చంద్రశేఖర్ అస్థిపంజరాన్ని వెలికితీశారు. పరారీలో ఉన్న బ్రిజ్భూషణ్ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. చంద్రశేఖర్ ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.