ఫేక్ అకౌంట్తో అమృత వర్షిణిని ఫేస్బుక్లో కించపరిచిన వ్యక్తి, అరెస్ట్
మిర్యాలగూడ: మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ సతీమణి అమృతను సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్లో కించపరిచిన వ్యక్తిని శనివారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: ప్రణయ్ కేసులో నేతలకు ఆర్యవైశ్య సంఘం వార్నింగ్
పోలీసుల విచారణ
అతను నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి గత కొద్ది రోజులుగా అమృత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు అందింది. అమృత కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ జరిపించారు. నిందితుడిని గుర్తించారు. సోషల్ మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగా ఇతరులపై వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
కించపరిచే వ్యాఖ్యలు
ప్రణయ్ హత్య, తదనంతర పరిణామాలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. అమృత ప్రారంభించిన అకౌంట్తో, అతను పేక్ అకౌంట్ను ప్రారంభించి, పలు రకాల పోస్టులు పెట్టాడు. అందులో అమృతను కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో పాటు, బెదిరింపులకు కూడా దిగాడని ఫిర్యాదు చేశారు.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఈ నేపథ్యంలో అమృత వర్షిణి పదిహేను రోజుల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐటీ కోర్ టీమ్ సహాయం తీసుకొని విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం వ్యక్తిగా గుర్తించారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
భారీ సభ
కాగా, ఈ నెల 21వ తేదీన ప్రణయ్ సంస్మరణ సభను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కూడా ఇటీవల విడుదల చేశారు. ప్రణయ్ నివాసం నుంచి భారీ ర్యాలీతో వెళ్లి సభను నిర్వహిస్తారు. కాగా, ఇటీవల అమృత వర్షిణి.. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమపై చేసిన కామెంట్ల మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమె అర్థం లేని వ్యాఖ్యలు చేశారని పలువురు విమర్శలు చేస్తున్నారు.