వయసు పైబడిందని కన్నతల్లి తలను గోడకేసి బాది చంపిన కొడుకు
హైదరాబాద్: నవమాసాలు మోసి కని పెంచిన తల్లి పాలిట కన్న కొడుకే కాలయముడయ్యాడు. తలకొరివి పెడతాడని నమ్మితే ఆమె తలను పగలకొట్టాడు. వయసు పైబడి తల్లి అనారోగ్యం పాలైతే తల్లిని నిర్ధాక్షిణ్యంగా హత్యచేశాడు. గోడకేసి బాది తలను బదల్లకొట్టి కన్నతల్లిని చంపేశాడు.
ఆ తర్వాత కన్నతల్లి మంచం పైనుంచి కిందపడి మరణించిందని లోకాన్ని నమ్మించాడు. అంత్యక్రియల సందర్భంగా అతడి ప్రవర్తనపై సందేహాస్పదంగా ఉండడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.... బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2 దోభిఘాట్కు చెందిన రాణిబాయి(70) ఏకైక కుమారుడు కరణ్సింగ్. రాణిబాయి ఎంతో కష్టపడి కుమారుడిని పెంచింది. అయితే వయసు మీద పడడంతో కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది.
ఆరోజు నుంచి కరణ్ సింగ్ తల్లి పట్ల కాస్తంత కటువుగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం మరింతగా పెరిగి ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మంచం పైనుంచి లేవలేని స్థితికి చేరుకుంది. మలమూత్రాలు ఇంట్లోనే చేయడంతో ఆగ్రహానికి గురైన కరణ్సింగ్ రెండు రోజుల క్రితం ఆమెను కింద పడేసి తలను గోడకేసి బాదాడు.
తీవ్ర రక్తస్రావం జరగడంతో రాణిబాయి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా.. అనారోగ్యంతో బాధపడుతున్నతల్లి మంచంలో నుంచి కిందకు దిగుతుండగా పడిపోయి మరణించిందని చెప్పాడు. అనంతరం బుధవారం అంత్యక్రియలు పూర్తిచేశాడు.
అయితే అంత్యక్రియల సందర్భంగా కరణ్ ప్రవర్తనపై రాణిబాయి సోదరుడు రణబీర్సింగ్కు అనుమానం వచ్చి, బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి పోలీసులు కరణ్సింగ్ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. ఈ విచారణలో తానే హత్య చేసిన్నట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.