షాక్: గర్భవతి అయిన భార్యను, కుమారుడిని చంపేశాడు
కరీంనగర్: అదనపు కట్నం కోసం ఓ కిరాతకుడు భార్య, ఏడాది వయస్సున్న కొడుకును ఓ వ్యక్తి వెనకా ముందూ ఆలోచించకుండా చంపేశాడు. ఆ తర్వాత తాను బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. దాన్ని గమనించిన స్థానికులు అతనిని కాపాడి ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని చాకుంటలో ఆదివారం చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి - చాకుంట గ్రామానికి చెందిన నీలం రమేశ్(32) కొలిమికుంట గ్రామానికి చెందిన చొక్కల్ల అనిత(25) రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో రూ.10లక్షల కట్నం ఒప్పుకొని, రూ.5లక్షలు అప్పగించారు. దాంతో వారి సంసారం సజావుగా సాగుతూ ఏడాది తర్వాత వీరికి చరణ్తేజ(1) అనే పుత్రుడు పుట్టాడు.
అప్పటి నుంచి తనకు ఒప్పుకున్న కట్నం ఇవ్వాలని రమేశ్, అనితను వేధింపులకు గురిచేసేవాడు. అయినా కట్నం దాహం తీరని రమేశ్ తన తల్లిదండ్రులు నారాయణ, కనుకమ్మ, రమేశ్ తమ్ముడు వెంకటరమణ, వారి అమ్మమ్మ వెంకమ్మ ప్రతిరోజు వేధింపులకు గురిచేసినట్టు తెలిపారు.
ఈ విషయాన్ని అనిత తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఒప్పుకున్న మిగతా రూ.5 లక్షలను అప్పజెప్పారు. ఇచ్చిన కట్నం సరిపోలేదని, అదనపు కట్నం తేవాలని, ఆ డబ్బులతోనే రమేశ్కు అతని తండ్రి ఉద్యోగం వస్తుందని అనితను రమేశ్ కుటుంబ సభ్యులు తరుచూ ఇబ్బందులకు గురిచేసేవారు.
ఈ విషయాన్ని అనిత తన తల్తిదండ్రులు, అన్నయ్యకు తెలుపడంతో వారు కొలిమికుంట గ్రామంలో 14 గుంటల భూమిని రమేశ్ తల్లి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అయినా గొడవ తగ్గలేదు. నాలుగురోజుల చరణ్తేజ పుట్టినరోజు ఉండగా, బంధువుల సమక్షంలోనే అనితపై రమేశ్ చేయి చేసుకున్నట్టు తెలిసింది. తనను అదేపనిగా వేధిస్తున్నట్టు శనివారం అనిత తన అన్నయ్యకు చెబుతూ తనను తీసుకెళ్లాలని, లేకపోతే తానే ఇంటికి వచ్చేస్తానని చెప్పింది.
ఆదివారం ఉదయం 10గంటలు కావస్తున్నా ఇంటికి వస్తానన్న చెల్లె రాకపోవడంతో అనితకు ఫోన్ చేయగా, స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే అనిత అనయ్య శ్రీనివాస్ చాకుంటకు వెళ్లాడు. రమేశ్ ఇంటి తలుపులు తెరిచి చూడగా అనిత, చరణ్తేజ మంచంపై నిర్జీవంగా పడి ఉండడాన్ని గమనించాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
భార్య, కొడుకును హతమార్చిన రమేశ్, గ్రామంలోని ఓ బావిలో దూకాడు. స్థానికులు అతన్ని రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్రంలోని వైద్యశాలకు తరలించారు. అదనపు కట్నం కోసం తన చల్లెలు, అల్లుడిని హతమార్చిన రమేశ్తో పాటు అతనకి సహకరించిన కుటుంబ సభ్యులందరినీ కఠినంగా శిక్షించాలని మృతురాలి అన్నయ్య శ్రీనివాస్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీబాబు, ఎస్ఐ రవీందర్ తెలిపారు.