అక్రమ సంబంధమని అనుమానం: భార్యను చంపి, భర్త ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి పిల్లల ముందే భార్యను కిరాతకంగా హత్య చేసి, తాను ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. చిత్తుగా మద్యం సేవించి అతను పనికి పాల్పడ్డాడు. గొంతు కోసి అతను భార్య హతమార్చాడు.
తన గొంతూ కోసుకొని చావుబతుకుల ఉన్నాడు. కీసర సీఐ గురువారెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం పోచారం గ్రామానికి చెందిన మద్దెల మహేశ్ (30)కు అదే మండలం రామవరం గ్రామానికి చెందిన బోమ్మగాని రజని (25)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది.
వీరికి సోమేశ్ (6), సింధు (4) అనే ఇద్దరు పిల్లలున్నారు. మహేశ్ రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కీసర మండలం కుందన్పల్లి గ్రామానికి వచ్చి గీత కార్మికుడిగా రోజు కూలికి కుదిరాడు. అతని భార్య రజని కూడా గ్రామంలో కూలి పని చేస్తోంది. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న రజని ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త మహేశ్ అనుమానించాడు.
శనివారం మద్యం సేవించి ఇంటికొచ్చి అర్థరాత్రి గీత కార్మికులు వినియోగించే కత్తితో చిన్నారుల ముందే రజని గొంతు కోసి చంపేశాడు. తానూ గొంతు కోసుకున్నాడు. దీంతో షాక్ తిన్న సోమేశ్ ఎల్బి నగర్ కొత్తపేట్ వద్ద ఉన్న రజని సోదరుడు బొమ్మగాని రవికి ఫోన్ చేసి చెప్పాడు.
రవి కొత్తపేట్ నుంచి వచ్చేవరకూ రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిదండ్రుల వద్ద చిన్నారులిద్దరూ దిక్కుతోచక బెంగటిల్లి కూర్చున్నారు. రవి పోలీసులకు సమాచారం అందించాడు. రజని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం, కొన ఊపిరితో ఉన్న మహేశ్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.