బలవంతంగా మూడో పెళ్లి చేసుకున్నాడు: రోజూ కొడుతూ సిగరెట్లతో కాలుస్తూ...
సంగారెడ్డి: మెదక్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలికను బలవంతంగా మూడో వివాహం చేసుకున్నాడు. ఏడాది పాటు ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశాడు. ఆ కిరాతకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇతరుల సాయంతో తప్పించుకున్న బాలిక మెదక్ జిల్లా ఎస్పీ సుమతిని గురువారం ఆశ్రయించింది.
మెదక్ జిల్లా హత్నూర మండలం నాగారం గ్రామ పంచాయతీలోని కొండపాకకు చెందిన 16 బాలిక తల్లి మరణించింది. తండ్రి ఎల్లాగౌడ్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. దీంతో ఆమె తాత బాలాగౌడ్ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్నాడు. వారికి దూరపు బంధువైన నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన దస్తాగౌడ్ (45) ఆ బాలికతో చనువు పెంచుకున్నాడు.
ఆ బాలిక చెప్పిన వివరాల ప్రకారం - నిరుడు మార్చిలో ఆమెను ఇంటి నుంచి బలవంతంగా తీసుకుని వెళ్లాడు. ఏడుపాయల సమీపంలోని సరస్వతీ దేవాలయంలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని అక్కడి నుంచి హైదరాబాద్ మకాం మార్చాడు. బంజారాహిల్స్లోని పలు దుకాణాల్లో, కొన్ని ఇళ్లలో ఇంటి పనులు చేయించేవాడు.
అంతేకాకుండా ప్రతి రోజూ బాలికను కొట్టేవాడు, సిగరెట్తో కాల్చేవాడు. వాతలు పెట్టడం వంటి చిత్రహింసలకు గురి చేసేవాడు. చిత్రహింసలు భరించలేని బాలిక బాధలు చూడలేకపో కొందరు ఇరుగు పొరుగువారు సాయం చేశారు. దాంతో ఆమె దస్తాగౌడ్ బారి నుంచి తప్పించుకుని తన సొంత గ్రామమైన కొండపాకకు చేరుకుంది.
ఆ విషయాన్ని బాలిక గ్రామపెద్దలకు చెప్పడంతో వారు బాధితురాలిని ఎస్పీ సుమతి వద్దకు తీసుకుని వెళ్లారు. స్పందించిన ఎస్పీ విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు.
ఈ విషయంలో హత్నూర పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యుడు అచ్యుతరావు జిల్లా ఎస్పీ సుమతికి మెమో జారీ చేశారు. నిందితుడిపై హత్నూర పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు.