హత్యకు దారి తీసిన మాంసం షేరింగ్, గొడ్డలితో భార్యను నరికి చంపిన భర్త
హైదరాబాద్: వేటకు వెళ్లి వేటాడి తీసుకొచ్చిన వన్యప్రాణులను పంచుకోవడంలో చెలరేగిన గొడవ పెద్ద వివాదమై చివరకు ఒకరి హత్యకు దారి తీసింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం దమ్మూరు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన పెద్దిగడ్డ బాబు(40), చిన్నబాపు(35) వేటకు వెళ్లి వన్య ప్రాణుల మాంసాన్ని తెచ్చుకున్నారు. దీనిని పంచుకునే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో చిన్నబాపు కర్రతో బాబుపై దాడి చేశాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గొడ్డలితో భార్యను నరికి చంపిన భర్త
తాళికట్టిన భార్యను అత్యంత కిరాతకంగా భర్త హతమార్చిన సంఘటన పాలమూరు జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, జిల్లాలోని తలకొండపల్లి మండలం తడక తండాకు చెందిన శారద(30)కు భర్త ఈస్రాతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
బుధవారం రాత్రి భర్త మద్యం మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపేసాడు. దీంతో శారద అక్కడిక్కడే మరణించడంతో, భర్త ఈస్రా పరారయ్యాడు. గురువారం ఉదయం సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.