ఆమె అలా చెప్పేసరికి: ఫోటోలు ఫేస్బుక్లో పెట్టి మరీ ఆత్మహత్య.. ప్రతీకారం కోసమే!
ఆత్మహత్యకు ముందు తను ప్రేమించిన యువతి ఫోటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి.. వాటిని షేర్ చేయాల్సిందిగా మిత్రులను కోరాడు.
వరంగల్: రెండేళ్లుగా తనతో ప్రేమలో ఉన్న యువతి.. హఠాత్తుగా తనను దూరం పెట్టేసరికి అతను తట్టుకోలేకపోయాడు. యువతికి మరో యువకుడితో పెళ్లి ఓకె అయిందని తెలిసి ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అదే సమయంలో యువతిని గుడ్డిగా నమ్మినందుకు తనకు తాను శిక్షించుకున్నాడు. మహబూబాద్ జిల్లా కురవిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
కురవి గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగి గూడూరు ఉపేందర్(25) సోమవారం ఆత్మహత్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తను ప్రేమించిన యువతి ఫోటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి.. వాటిని షేర్ చేయాల్సిందిగా మిత్రులను కోరాడు. తద్వారా తనను మోసం చేసిన అమ్మాయికి ఇంకెవరితోను పెళ్లి కాకూడదని భావించాడు.
కాగా, ఆ యువతితో ఉపేందర్ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో ఎంబీఏ చదివే సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆపై అది ప్రేమగా మారగా.. చెన్నైలోని విప్రో కంపెనీలో జాబ్ వదులుకుని మరీ ఉపేందర్ ఆమె కోసం మహబూబాద్ వచ్చేశాడు. అక్కడే ఓ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
గత ఐదు రోజుల నుంచి యువతి అతన్ని దూరం పెడుతుండటంతో తట్టుకోలేకపోయాడు. కారణం అడిగితే.. తల్లిదండ్రులు తనకు వేరే వ్యక్తితో సంబంధం చూశారని ఆమె బదులిచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉపేందర్ పురుగుల ముందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆపై యువతితో తాను కలిసి ఉన్న ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేయించాడు.
అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి యువతిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయాలని పట్టుబట్టాడు. ఉపేందర్ పురుగుల మందు తాగాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు..హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు.