ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతి కేసు : సత్యనారాయణ రెడ్డి వద్ద పనిచేసే వ్యక్తి ఏం చెబుతున్నాడు..
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం మృతి కేసులో పలు అనుమానాలు తెర పైకి వస్తున్నాయి. దాదాపు 20 రోజులకు పైగా ఆ కుటుంబం కనిపించకుండా పోయినా ఎవరూ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న అనుమానం తలెత్తుతోంది. ఇంటి తాళం పగలగొట్టి చూసినవారు.. లోపల ఎవరూ లేరని తెలిశాక కూడా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనే అనుమానం కూడా తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో మృతుడు,మనోహర్ రెడ్డి బావ సత్యనారాయణ రెడ్డి ఫర్టిలైజర్ షాపులో పనిచేస్తున్న నర్సింగ్ అనే వ్యక్తి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
,సత్యనారాయణ రెడ్డి గతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేశారని,అయితే కొన్నేళ్ల క్రితం కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటి నుంచి ఆ బిజినెస్ తగ్గించేశారని చెప్పాడు. సత్యనారాయణ రెడ్డి కుటుంబం ఇంటి నుంచి వెళ్లే రోజు తనను పిలిచారని.. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను కారులో పెట్టమన్నారని చెప్పాడు. బెడ్ షీట్స్,గ్యాస్ స్టవ్ ఇతరత్రా వస్తువులను తాను కారు డిక్కీలో పెట్టినట్టు చెప్పాడు. వాళ్లు బయలుదేరిన కొద్దిసేపటికి తాను సత్యనారాయణ రెడ్డికి ఫోన్ చేసి.. సిలిండర్ మరిచిపోయారని గుర్తుచేశానన్నారు. అయితే అక్కడ ఇంకొకటి ఉందిలే అని ఆయన చెప్పారన్నారు. అంతే తప్ప.. వారు ఎక్కడికి వెళ్తున్నారు.. ఏంటి అనేది తాను అడగలేదన్నారు. ఆ మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచాఫ్ వచ్చిందని.. ఆ విషయాన్ని తాను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి తెలియజేశానని చెప్పారు. అప్పటినుంచి వారే ఆరా తీస్తున్నారని.. ఇక తమకేమీ తెలియదని స్పష్టం చేశారు.
Recommended Video
కాగా,కరీంనగర్ జిల్లా అలుగునూర్ సమీపంలోని కాకతీయ కెనాల్ కాలువలో కారు బయటపడ్డ సంగతి తెలిసిందే. అందులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి రాధ,బావ సత్యనారాయణ రెడ్డి,మేనకోడలు వినయశ్రీల మృతదేహాలు ఉన్నాయి. చనిపోయి దాదాపు 20 రోజులకు పైనే కావడంతో శవాలు కుళ్లిపోయాయి. జనవరి 27వ తేదీనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిజానికి ఈ ఘటన వెలుగుచూసిన తీరు కూడా అనూహ్యంగా ఉంది. అంతకుముందు రోజు ఓ బైక్ ఆ కాలువలో పడి కీర్తన అనే మహిళ గల్లంతయింది. ఆమె కోసం గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో.. అనుకోకుండా ఈ కారు బయటపడింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.