వెక్కిరించిన పేదరికం: భార్య శవంతో బస్సులో ప్రయాణం
హైదరాబాద్: ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ నిరుపేద మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో ఓ తల్లి కన్నుమూసింది. ఇద్దరు కుమారులు, అప్పుడే పుట్టిన పసిబిడ్డ, పక్కనే భార్య మృతదేహం ఏం చేయాలో తోచక... శవం, పిల్లలతో పాటు అర్ధరాత్రి సొంతూరికి బయల్దేరాడో వ్యక్తి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పాలమూరు జిల్లాకు చెందిన ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన మమ్మద్ షఫి హైదరాబాద్లోని కాటేదాన్లో భార్యా పిల్లలతో ఉంటు లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఎప్పటిలాగే షఫి పనికి వెళ్లాడు. నిండు గర్బిణీ అయిన షఫి భార్య ముష్రత్బేగ్ (35)ను రాత్రి 10గంటల సమయంలో కాలనీలోనే ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళింది.
10:50 గంటల సమయంలో ఆడశిశువుకు జన్మనిచ్చి తల్లి చనిపోయింది. ఆమె వెంట ఎవరూ లేకపోవటంతో ఆసుపత్రి సిబ్బంది శవాన్ని ఓ మూలన వేశారు. అనంతరం ఇంటికి వచ్చిన షఫి విషయం తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లాడు. అప్పటికే భార్య చనిపోయిందని తెలియటంతో విలపించాడు.
మృతదేహాన్ని భుజాన వేసుకుని, పసిగుడ్డు, తన ఇద్దరు కొడుకులతో కలిసి అర్ధరాత్రి రాయచూర్ బస్సు ఎక్కాడు. ఇక హైదరాబాద్ నుంచి మక్తల్ వెళ్లాలంటే, ఒక్కొక్కరికి రూ. 156 చొప్పున రూ.312 అవసరం. కానీ షఫి జేబులో రూ.200 మాత్రమే ఉన్నాయి. దీంతో.. తనకు, భార్య శవానికి పాలమూరు వరకే టికెట్ తీసుకున్నాడు.
బస్సులో ప్రయాణికులకు మాత్రం తన భార్య బాలింత అని చెప్పి వెనక సీటులో పడుకోబెట్టాడు. తెల్లవారుజామున పాలమూరు బస్టాండులో శవాన్ని దించి గేటు పక్కన పడుకోబెట్టాడు. అక్కడి నుంచి ఊరికి వెళ్ళేందుకు డబ్బులు లేకపోవడంతో పిల్లలు, భార్య శవంతో అక్కడే రోదిస్తూ కూర్చున్నాడు.
దీంతో విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు, గేటు పక్కన రోదిస్తున్న షఫి వద్దకు వెళ్లి విషయం తెలుసుకుని, అక్కడున్న వారు తలా కొంత మొత్తం వసూలు చేయగా రూ. 8వేలు రావడంతో అతడికి ఇచ్చి ఆటోలో స్వగ్రామం ఉట్కూర్కు పంపించారు.
ఇదే సమయంలో బస్టాండ్కు వచ్చిన సీఐ సోమ్ నారాయణ్సింగ్ వివరాలు నమోదు చేసుకుని, పసిబిడ్డను వైద్యం నిమిత్తం ఐసీడీఎస్ అధికారులను అప్పగించి వారి ద్వారా జిల్లా ఆసుపత్రికి పంపించారు.