రైతులకు బేడీలు వేయడం తప్పిదమే: ఒప్పుకున్న తెలంగాణ మంత్రి!
మిర్చి పంటకు గిట్టుపాట ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మార్కెట్ యార్డులో కొంతమంది రైతులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
నిజామాబాద్: ఖమ్మం మిర్చి యార్డుపై దాడి ఘటనకు కారకులైన రైతులను కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో వారి చేతులకు బేడీలు వేసి ఉండటం తెలంగాణ సర్కార్ ను అప్రతిష్టపాలు చేసింది. పోలీసుల చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఇద్దరు అధికారులపై వేటు వేసింది.
తాజాగా ఇదే విషయంపై స్పందిస్తూ.. రైతులకు బేడీలు వేయడం పొరపాటు చర్యేనని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామన్నారు. రైతులకు బేడీల ఘటనలో పోలీసులు అత్యుత్సాహం చూపించారన్నారు.
కాగా, మిర్చి పంటకు గిట్టుపాట ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మార్కెట్ యార్డులో కొంతమంది రైతులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి కారకులైనవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. గురువారం నాడు వారిని కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో బేడీలతో వారిని అక్కడికి తీసుకురావడం తీవ్ర విమర్శలకు గురిచేసింది.