మరో వివాదంలో మానకొండూరు సిఐ .. పోలీస్ స్టేషన్ లో ఓ కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకలు
మానకొండూరు పోలీసులు మరో వివాదంలో పడ్డారు. ఏకంగా పోలీస్ స్టేషన్ నే ఒక కాంట్రాక్టర్ పుట్టిన రోజు వేడుకలకు వేదిక చేశారు. తాము ఆడింది ఆట పాటింది పాట అని భావించిన మానకొండూరు సిఐ చేసిన ఈ నిర్వాకం అటు పోలీస్ వర్గాల్లోనూ , ఇటు రాష్ట్రంలోనూ హాట్ టాపిక్ గా మారింది.
స్థానిక సంస్థల పోరు ...బ్యాలెట్ పోరుపై సర్వత్రా ఉత్కంఠ
దుర్వినియోగం అవుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ .. కాంట్రాక్టర్లు , రాజకీయ నేతలతో పోలీసుల దోస్తీ
రాష్ట్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించటానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ప్రవేశపెట్టారు. ప్రజలు పోలీస్ స్టేషన్ లన్నా , పోలీసులన్నా భయంతో తమ సమస్యలను పోలీసుల దాకా తీసుకువెళ్లటం లేదని భావించి ప్రజలతో మమేకమై శాంతి భద్రతలను కాపాడాలని భావించి ఈ విధానం ప్రారంభించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పోలీసులు ప్రజలకు దగ్గర అయ్యారో లేదో తెలియదు కాని కొందరు పోలీసులు కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు మాత్రం బాగానే దగ్గరయ్యారు.
మానకొండూరు పీఎస్ లో కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకలు .. సోషల్ మీడియా లో వైరల్
ఎన్నికల వేళ విధులు నిర్వహించాల్సిన పోలీసులు అది మరిచి పోలీస్ స్టేషన్ లో ఒక కాంట్రాక్టర్ బర్త్డే వేడుకలు చేశారంటే వారి నిబద్ధత ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే శనివారం రాత్రి మానకొండూర్ పోలీస్ స్టేషన్ లో సీఐ ఇంద్రసేనారెడ్డి తన గదిలో ఓ కాంట్రాక్టర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ పుట్టిన రోజును ఘనంగా చేసిన సిఐ సదరు కాంట్రాక్టర్ కు శాలువాలు, పూలమాలతో సత్కరించి తన చాంబర్ లోనే ఆయనతో కేక్ కట్ చేయించారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ఈ పుట్టినరోజు వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . దీంతో ఈ వీడియో చూసిన వారంతా షాక్ కు గురయ్యారు.
మానకొండూరు సిఐ మొదట నుండి వివాదాస్పదుడే.. గతంలో సర్వీస్ రివాల్వర్ తో బెదిరింపు
మానకొండూరు సిఐ మొదటి నుండి వివాదాస్పదుడే . గతంలోనూ ఆయనపై అనేక వివాదాలున్నాయి. ఇక తాజాగా కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి పుట్టిన రోజు పోలీస్ స్టేషన్ లో చేసి మరో వివాదంలో చిక్కుకున్నాడు . గతంలో ఇదే రవీందర్ రెడ్డితో కలిసి మద్యం సేవించి సర్వీస్ రివాల్వర్ తో బెదిరింపులకు పాల్పడ్డాడు ఇంద్రసేనారెడ్డి . ఏడాదిన్నర క్రితం ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ కు బదిలీ అయ్యారు. అయితే అప్పట్లో విధుల్లో చేరకుండా రవీందర్ రెడ్డి మరికొందరితో కలిసి విందు చేసుకునేందుకు కాళేశ్వరం వెళ్లారు. మద్యం మత్తులో కారు బోల్తా పడగా స్థానికులు గమనించి సహాయం చేసేందుకు వచ్చారు.అయితే మద్యం మత్తులో ఉన్నవారంతా స్థానికులతో గొడవకు దిగారు. ఏకంగా ఇంద్రసేనారెడ్డి సర్వీస్ రివాల్వర్ తో స్థానికులను బెదిరించటం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటనపై శాఖపరమైన చర్యలు తీసుకోకపోగా సదరు అధికారికి పదోన్నతినిచ్చి మానకొండూర్ స్టేషన్ సీఐగా పోస్టింగ్ ఇచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో విచక్షణారహితంగా యువకులను కొట్టిన సిఐ .. రాజకీయ నాయకులు , కాంట్రాక్టర్ల అండదండలు
మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ ఇంటి ముందు ఫోన్ మాట్లాడుతున్న యువకులను రోడ్డుపై విచక్షణరహితంగా కొట్టి హాస్పిటల్ పాలు చేశారు. తాజాగా కాంట్రాక్టర్ బర్త్డే స్టేషన్లోనే నిర్వహించి అందర్నీ షాక్ కు గురి చేశారు. సదరు సిఐ కి రాజకీయ నాయకుల అండదండలు కూడా మెండుగానే ఉన్నట్టు సమాచారం. అందుకే తనను ఎవరు ఏమీ చెయ్యలేరని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతుంది.