మందుబాబులకు మంచు లక్ష్మీ కౌన్సిలింగ్: పోలీసుల వినూత్న ప్రయోగం
హైదరాబాద్: మందుబాబులకు అవగహన కల్పించేందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ రోడ్లపై డ్రంకన్ డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.
దీంతో ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు అర్ధరాత్రి పూట ముమ్మర సోదాలు నిర్వహించి పెద్ద సంఖ్యలో మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాంగంలోని చట్టాల ప్రకారం మందుబాబులకు చిన్నపాటి జరిమానా విధించి సరిపెట్టాల్సి వస్తోంది.
అయినా సరే డ్రంకన్ డ్రైవ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో డ్రంకన్ డ్రైవ్కు చెక్ పెట్టేందుకు గాను కౌన్సిలింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు సిధ్దమయ్యారు. ఇందులో భాగంగా ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మీతో కలిసి ఈ శుక్రవారం రాత్రి జూబ్లిహిల్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు.
తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి మంచు లక్ష్మీ అవగాహన కల్పిస్తారు. తాగి వాహనాలు నడపవద్దని, డ్రైవర్ను పెట్టుకోవాలని, భద్రత కోసం ట్రాఫిక్ పోలీసుల తనిఖీలకు అందరూ సహకరించాలని కోరనున్నారు.
జూబ్లిహిల్స్లోని భారతీయ విద్యాభవన్ జంక్షన్లో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి ఈ తనిఖీలు నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మందుబాబులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మంచు లక్ష్మీ కూడా అంగీకరించారు.