మందకృష్ణ సంచలనం: ఏపీలో తనపై హత్య కుట్ర?, కార్లు వెంబడిస్తున్నాయ్..
దేశవ్యాప్తంగా 10రాష్ట్రాల్లో ఎమ్మార్పీఎస్ పనిచేస్తోందని, మిగతా రాష్ట్రాల్లో స్వేచ్చగా తిరుగుతున్న తనను ఏపీలో మాత్రం చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
వరంగల్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తలపెట్టిన కురుక్షేత్ర మహాసభను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట తప్పి.. వర్గీకరణ విషయంలో చంద్రబాబు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ ఆరోపిస్తోంది.
కురుక్షేత్ర సభకు అనుమతి లేదు, గుంటూరులో రావెల ఫ్లెక్సీల కలకలం
ఈ వ్యవహారంపై తాజాగా మందకృష్ణ వరంగల్లో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో తనకు రక్షణ లేకుండా పోయిందని, తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయన్నారు. తాను ఎక్కడికెళ్లినా.. కొన్ని కార్లు తనను వెంబడిస్తున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 10రాష్ట్రాల్లో ఎమ్మార్పీఎస్ పనిచేస్తోందని, మిగతా రాష్ట్రాల్లో స్వేచ్చగా తిరుగుతున్న తనను ఏపీలో మాత్రం చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
కురుక్షేత్ర సభ జరగకుండా అక్కడి మాదిగ ఎమ్మెల్యేలను ప్రభుత్వం బెదిరించిందని ఆరోపించారు. స్వేచ్చతో పాటు, రక్షణ కూడా కరువైన చోట.. తాను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పుకొచ్చారు. తనను కార్లు వెంబడిస్తున్న విషయం, ఏపీలో తనపై జరుగుతున్న కుట్ర తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా ఉండదని, కాబట్టి సీఎం కేసీఆర్ దీన్ని 24గం.ల్లో తేల్చాలని డిమాండ్ చేశారు.
నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని, వర్గీకరణ చేస్తామన్నారు కాబట్టే ఇరు రాష్ట్రాల సీఎంలతోను కలిసి పనిచేశామని మందకృష్ణ అన్నారు. చంద్రబాబు లాంటి వారు మరో 100మంది వచ్చినా ఎమ్మార్పీఎస్ ఎదుర్కొంటుందని తేల్చి చెప్పారు.