కేసీఆర్ తీరుపై మందకృష్ణ దీక్ష, టీ న్యూస్ సరే.. ఏబీఎన్ మాటేంటో: కాంగ్రెస్
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వివక్షను ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ వరంగల్ జిల్లా హన్మకొండలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఒక్కరోజు దీక్షను చేపట్టారు.
ఏబీఎన్ నిషేధిస్తే స్పందించలేదేం: కాంగ్రెస్
తెలంగాణలో ఏడాదికాలంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని నిషేదిస్తే స్పందించని కొందరు నేతలు టీ న్యూస్కు నోటీసులు ఇస్తే మాత్రం మాట్లాతున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు బస్వరాజు సారయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు గురువారం మండిపడ్డారు.
టీ న్యూస్కు నోటీసులు ఇస్తే రాజ్యాంగానికి విఘాతం కలిగిందని గగ్గోలు పెట్టడం విడ్డూరమన్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మీడియాను నిషేధిస్తోందన్నారు. ప్రజాస్వామ్యం హక్కులకు భంగం కలిగిస్తోందని మండిపడ్డారు.
రాజ్యాంగ పరిధిలో పాలన సాగడం లేదన్నారు. కేసీఆర్ది ప్రజా వ్యతిరేక పాలన అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని మంత్రి బస్వరాజు సారయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వరంగల్ నుండి ప్రారంభమవుతుందని చెప్పారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు.