మోసం: కేసీఆర్పై మందకృష్ణ మాదిగ నిప్పులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల హామీలను తుంగలో తొక్కి నిజాం నిరంకుశ ధోరణులతో పాలన సాగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ శనివారం ధ్వజమెత్తారు.
గిరిజనులు, మహిళలు, ముస్లీంలకు రిజర్వేషన్ అంశంపై ప్లీనరీలో ఎలాంటి ప్రస్తావన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్ ప్రక్రియ విధి విధానమే సక్రమంగా లేదని మండిపడ్డారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఎలా చేపడతారని ప్రశ్నించారు.
తెలంగాణలోని కోటి మంది మాదిగలతో పాటు రెండు కోట్ల మంది ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఎక్కి దళితులను మోసం చేశారన్నారు.
ఉమ్మడి రాష్ట్ర కేబినెట్లో తెలంగాణకు చెందిన ఆరుగురు మహిళలకు చోటు దక్కితే, తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఒక్క మహిళకూ మంత్రి పదవి దక్కలేదన్నారు. తద్వారా మహిళలను కేసీఆర్ మోసం చేశారన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడానికి మహిళా గర్జన చేపట్టాలని భావిస్తున్నామన్నారు.