అమరావతిలో కెసిఆర్ మాట్లాడలేదేం, సిబిఐ మాటేమిటి, కెటిఆర్ సిరిసిల్లలో పుట్టాడా: సర్వే
వరంగల్: ఎమ్మార్పీఎస్ నాయకుల పైన దాడులు చేయిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ఎమ్మెస్సీ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ శనివారం నాడు వరంగల్ జిల్లాలో హెచ్చరించారు.
ఎస్సీ వర్గీకరణ పైన అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమ నాయకుల పైన దాడులు చేయడం విడ్డూరమన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ ప్రచారానికి రావడానికి ముందే ఎస్సీ వర్గీకరణ పైన మాట్లాడాలన్నారు. లేదంటే ఆయన ఎదుట నిరసన తెలుపుతామని హెచ్చరించారు.
కెసిఆర్ అవినీతిపరుడు: సర్వే
ముఖ్యమంత్రి కెసిఆర్ అవినీతిపరుడు అని వరంగల్ లోకసభ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ వేరుగా మండిపడ్డారు. గతంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ తప్పుడు పనులు చేసినందుకు సిబిఐ అభియోగాలు మోపిందన్నారు.
అమరావతి శంకుస్థాపన సభలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులు మాట్లాడుతూ... సోనియా గాంధీ తొందరపడి తెలంగాణ ఇచ్చారని వ్యాఖ్యానిస్తే అదే వేదిక పైన ఉన్న కెసిఆర్ తెలంగాణ ప్రజలను కించపరుస్తూ ప్రేక్షకపాత్ర వహించారని దుయ్యబట్టారు.
సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నా కెసిఆర్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలన్నారు. తాను స్థానికుడిని కాదని దుష్ప్రచారం చేస్తున్నారని, కెసిఆర్ కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో స్థానికుడు కాకున్నా ఎలా పోటీ చేశారో చెప్పాలని నిలదీశారు.
మంత్రి కెటిఆర్ సిరిసిల్లలో పుట్టారా, ఎంపీ కవిత నిజామాబాదులో పుట్టారా అని నిలదీశారు. నా స్థానికతను ప్రశ్నించే ముందు గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. పది రోజుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ వివరాలు బయటపెడతామన్నారు.
తాను రాజకీయాల్లో చేరినప్పుడు కెటిఆర్ చెడ్డీలు కూడా తొడగలేదన్నారు. ఉప ఎన్నికల్లో భారతీయ కరెన్సీని అవమానించినందుకు న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. మంత్రి కెటిఆర్ అక్రమంగా సంపాదిస్తున్నారని, అందుకే డబ్బు విలువ తెలియక అహంకారంగా మాట్లాడుతున్నారన్నారు.