హాట్ స్పాట్ గా మారిన మంగళ హాట్ ప్రాంతం .. ఒకే ఇంట్లో 16 మందికి కరోనా
హైదరాబాద్ లో కరోనా పంజా విసురుతుంది . ప్రజలలో ఎంత అవగాహన తీసుకువచ్చినా పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది . రాష్ట్ర వ్యాపతంగా కరోనా తగ్గుముఖం పడుతుంటే హైదరాబాద్ మాత్రం కరోనా డేంజర్ బెల్స్ మోగించే పనిలోనే ఉంది . మొన్నటికి మొన్న ఒక అపార్ట్ మెంట్ లో జరిగిన పార్టీ ఏకంగా 23మంది కరోనా బాధితులుగా మారిస్తే ఇక తాజాగా మంగళ హాట్ లో కరోనా హాట్ స్పాట్ గా మారింది .
హైదరాబాద్లో కొంప ముంచిన ఓ బర్త్ డే పార్టీ ... ఒకే అపార్ట్ మెంట్ లో 23 మందికి కరోనా
తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికి 1,551 కేసులు, హైదరాబాద్ లోనే అత్యధికం
హైదరాబాద్ లోని మంగళ హాట్ లో ఒకే కుటుంబంలో 16 మంది కరోనా సోకింది . కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నా , ఎంత అవగాహన తెస్తున్నా చాలా మంది పాటించటం లేదు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలోని కేసులను చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 1,551 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇందులో ఒక్క హైదరాబాద్ లోనే 981కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆదివారం కొత్తగా మరో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 37 కేసులను గుర్తించారు అధికారులు .
ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ కేసులు
కరోనా వైరస్ కొన్ని సార్లు ఎలాంటి లక్షణాలు లేకుండా పెరిగిపోతున్న నేపధ్యంలో చాలా మంది ఇన్ఫెక్షన్ బారిన పడిన వారికి అది తెలియటం లేదు . ఇక వీరి ద్వారా వారి నుంచి కుటుంబంలోని వేరే వాళ్లకు కూడా వైరస్ సోకుతోంది. ఇక మంగళ్హాట్లో కూడా అదే జరిగింది. కరోనా వైరస్ బారిన పడిన ఓ యువకుడి ద్వారా ఆ ఇంట్లోని 16 మంది వైరస్ బారిన పడటం ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మంగళ హాట్ లో యువకుడి ద్వారా కుటుంబంలో 16 మందికి కరోనా
హైదరాబాద్ లోని మంగళహాట్ కరోనా హాట్ స్పాట్ గా మారింది. స్థానికంగా నివసిస్తున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అతడి కుటుంబంలోని వారందరిని శాంపిల్స్ ని టెస్ట్ చేసిన అధికారులు షాక్ తిన్నారు . మొత్తం 27 మంది కుటుంబ సభ్యులు గల ఆ ఇంట్లో 16 మందికి వైరస్ పాటిజివ్ గా నిర్ధారణ కావటంతో వారందరినీ ఐసోలేషన్ కు తరలించారు . వారిలో 8 మంది చిన్నారులు సహా 16 మంది ఇన్ఫెక్షన్కు గురయ్యారు. ఇక కరోనాతో ఇంటి యజమాని చికిత్స పొందుతూ మృతి చెందారు . ఇక దీంతో మంగళ హాట్ ప్రాంతాన్ని శానిటైజ్ చేసి నో మూమెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు .
హైదరాబాద్ వాసుల నిర్లక్ష్యమే కరోనా వ్యాప్తికి కారణం
ఇక ఇదే సమయంలో మరోవైపు మణికొండ మున్సిపాలిటీలోని అలీజాపూర్ లో కూడా ఒక పాజిటివ్ కేసు వెలుగు చూసింది. దీంతో అతడిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడికి టచ్ లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన 14 మందిని క్వారంటైన్ కి తరలించారు అధికారులు.అలాగే ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేసి రెడ్ జోన్ గా ప్రకటించారు.ఒకపక్క రాష్ట్రం అంతా కరోనా తగ్గుతుంటే భాగ్యనగరంలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్న తీరు ప్రజల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది.