దళితులపై ఫేస్బుక్లో వ్యాఖ్యలు: ఎమ్మెల్యే రాజా సింగ్పై కేసు నమోదు
హైదరాబాద్: బీజేపీ యువనేత, హైదరాబాద్లోని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజా సింగ్పై కేసు నమోదైంది. గుజరాత్లో దళితులపై గోరక్ష దళ్ సభ్యులు చేసిన దాడిని సమర్ధిస్తూ రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై మాల సంక్షేమ సంఘం ఫిర్యాదుతో మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే... ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం తన ఫేస్బుక్ పేజీలో ఓ వీడియోను అప్లోడ్ చేశారు. అందులో జులై నెల 22న గుజరాత్లోని ఉనా పట్టణంలో గోరక్ష దళ సభ్యులు దళితులపై చేసిన దాడిని సమర్థిస్తూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీ అధినేత మాయావతిని సైతం నిలదీశారు.
హైదరాబాద్లో చాలా మంది దళిత సోదరులు గోవుల సంరక్షణకు తనకు ఎంతగానో మద్దతు తెలుపుతున్నారని కొనియాడారు. కానీ కొంత మంది దళితులు ఆవులను చంపి తింటున్నారని మండిపడ్డారు. అలాంటి దళితులు సిగ్గుపడాలని పేర్కొన్నారు.
JUST IN | Hyderabad: Mangalhat police registers a case against BJP MLA Raja Singh for his remarks against Dalits
— News18 (@CNNnews18) August 4, 2016
దీంతో పాటు దళితులను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వీడియోను ఆధారంగా చూపుతూ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ మంగళ్ హాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రాజాసింగ్పై పోలీసులు ఐపీసీ 153ఏ కింద కేసు నమోదు చేశారు.