వరుడు తాళి కట్టిన కాసేపటికే నవ వధువు మెడలో మంగళసూత్రం కాజేశారు!
కామారెడ్డి: నవ వధువు మెడలో వరుడు తాళి కట్టగానే ముగ్గురు మహిళలు చోరీ చేసి పారిపోయే ప్రయత్నం చేసేశారు. అప్రమత్తమైన బంధువులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం కన్నారెడ్డికి చెందిన పేరుపల్లి సత్తవ్వ, బాలపోచయ్య కుమార్తె పావని వివాహం బుధవారం గ్రామంలో జరిగింది. వరుడు.. వధువు మెడలో తాళి కట్టాడు.
అయితే, కాసేపటికి అది కనిపించలేదు. అప్పటి వరకూ పెళ్లికుమార్తె వెంట ఉన్న ముగ్గురు మహిళలు కారులో పారిపోవడానికి ప్రయత్నించడంతో వారిపై అనుమానం వచ్చి కొందరు గుర్తించి వెంబడించారు. గ్రామం శివారులో వారిని పట్టుకున్నారు.
అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి సోదా చేయగా కారు మ్యాట్ కింద మంగళసూత్రం దొరికింది. దీంతో మంగళసూత్రాన్ని పెళ్లివారికి అప్పగించిన పోలీసులు.. ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.