ఎంట్రీ నహీ హై భయ్యా: హైదరాబాద్లో దారుణం: చైనీయులను పోలిన ముఖం: సూపర్ మార్కెట్లోకి నో ఎంట్రీ. !
హైదరాబాద్: మనదేశంలో మినీ ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్న ఏకైక నగరం.. హైదరాబాద్. దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు మన భాగ్యనగరంలో నివసిస్తున్నారు. వలస కార్మికుల సంఖ్యా ఎక్కువే. జీవనోపాధి కోసమో, ఉన్నత విద్య అవసరాల కోసమో దేశం నలుమూలల నుంచీ హైదరాబాద్కు వస్తుంటారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో జంటనగరాల్లో నివసిస్తున్నారు. వారందరినీ సాటి సోదరులుగా గౌరవిస్తుంటారు హైదరాబాదీయులు.
భారత్లో బలపడుతోన్న కరోనా: మరింత ధాటిగా: ఒకేరోజు 540 పాజిటివ్ కేసులు: ఇదివరకెప్పుడూ లేనంతగా..
కొత్త ముఖాలను చూస్తే ఉలికిపాటు..
కరోనా వైరస్ విస్తరించిన ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ముఖాలను చూసి, ఉలిక్కిపడుతున్నారు హైదరాబాదీయులు. వివక్షను చూపుతున్నారు. వారిని దూరంగా ఉంచుతున్నారు. ఇదివరకు అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు పట్ల కొందరు స్థానికులు అమానవీయంగా ప్రవర్తించారు. కరోనా వైరస్ అని సంబోధిస్తూ అవహేళనకు గురి చేశారు. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి హైదరాబాద్లోనే చోటు చేసుకుంది.
మణిపూర్ యువకులకు చేదు అనుభవం..
జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు మణిపూర్ యువకులకు చేదు అనుభవం ఎదురైంది. వారి ముఖం చైనీయులను పోలి ఉండటం వల్ల విదేశీయులుగా భావిస్తున్నారు. మణిపూర్ నుంచి వచ్చిన ఆ యువకులు కొంతకాలంగా వనస్థలిపురంలో నివసిస్తున్నారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి వనస్థలిపురం సమీపంలోని ఓ సూపర్ మార్కెట్కు వెళ్లగా.. వారిని లోనికి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు సెక్యూరిటీ గార్డులు.
భారతీయులమని చెప్పుకోవాల్సిన దుస్థితి..
లోనికి వెళ్లడానికి అనుమతి లేదని ఎంట్రన్స్లోని నిలిపివేశారు. తాము భారతీయులమేనని చెప్పుకోవాల్సిన దుస్థితిని వారు ఎదుర్కొన్నారు. తాము మణిపూర్ వాసులమని, చాలాకాలంగా వనస్థలిపురంలో నివసిస్తున్నామని చెప్పుకొన్నప్పటికీ కనికరించలేదు సెక్యూరిటీ గార్డులు. వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా వారిద్దరూ హైదరాబాద్ చిరునామా ఉన్న ఆధార్ కార్డులను చూపించినప్పటికీ పట్టించుకోలేదు. తమ మేనేజర్తో మాట్లాడిన తరువాతే అనుమతి ఇస్తామని, అప్పటిదాకా ఇక్కడ నిల్చోవద్దంటూ హూంకరించారు.
తెలుగులో మాట్లాడితేనే సమాధానం..
ఎంట్రీ నహీ హై భయ్యా.. అంటూ వెనక్కి తిప్పి పంపించారు. తనకు హిందీ తెలియదని, తెలుగులో మాట్లాడాలని సెక్యూరిటీ గార్డు వారిని సూచించారు. తెలుగులో మాట్లాడితేనే తాను సమాధానమిస్తానని చెప్పారు. భారతీయులందరికీ తెలుగు ఎక్కడి నుంచి వస్తుందని ఆ మణిపూర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన పట్ల రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.